ఆరునెలల గర్భంతో ఉన్న భారత సంతతికి చెందిన ప్రాషిలా విల్సన్ అనే మహిళ ఆస్ట్రేలియాలోని ట్వీడ్ నదిలో మునిగి చనిపోయారు. మృతురాలు ప్రయాణించిన విలాసవంతమైన నౌకకు సమీపంలో ఆమె శవం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. హెరాల్డ్ సన్ పత్రికా కథనం ప్రకారం... నౌకకు 30 మీటర్ల దూరంలో ప్రాషిలా మృతదేహాన్ని సోమవారం కనుగొన్నట్లు తెలుస్తోంది.తన భార్య కనిపించటం లేదంటూ మృతురాలి భర్త మైఖేల్ సీరీ ఫిర్యాదు చేయడంతో, ప్రాషిలా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారి మైఖేల్ కెన్నీ మాట్లాడుతూ... ప్రాషిలా కనిపించడం లేదంటూ, ట్వీడ్ హెడ్లోని ఇవోరి కోస్ట్ మారినా నుంచి శనివారం రాత్రి తమకు ఫోన్ వచ్చినట్లు పేర్కొన్నారు.ప్రాషిలాకు ఈత రాదని, ఆమె ఆరునెలల గర్భంతో కూడా ఉన్నట్లు కెన్నీ వివరించారు. ట్వీడ్ నదిలో ఆమెకోసం తీవ్రంగా గాలించగా... సోమవారంనాడు విల్సన్ మృతదేహం లభ్యమైనట్లు ఆయన తెలిపారు. కాగా... మృతురాలు ప్రమాదవశాత్తు చనిపోయిందా, లేక మరే ఇతర కారణాలున్నాయన్న కోణంమీద డిటెక్టివ్ల చేత దర్యాప్తు చేయించనున్నట్లు కెన్నీ తెలియజేశారు. |