అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్కడ నివశిస్తున్న తెలుగు యువతు ఎంతగానే ఆకట్టుకున్నారు. సమాజంలో ధనిక వర్గాలకు, పేద వర్గాలకు మధ్యగల అంతరాన్ని తొలగించడానికి కృషి చేయాలన్నదే తన జీవిత పరమావధిగా మంగళవారం రాత్రి లాస్ ఏంజెలెస్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు.
తమ అమెరికా పర్యటన రాజకీయాలకు దూరం అని ముందుగానే ప్రకటిస్తూ ప్రవాసాంధ్రులు అందరూ తమ ఆదాయంలో కొంత భాగాన్ని మాతృభూమి ప్రగతి కోసం వెచ్చించాలని విజ్ఞప్తి చేశారు. వివాదాస్పదమైన అంశాల చర్చకు ఇది వేదిక కాదంటూ అందరూ సేవాభావాన్ని పెంచుకుని జాతి ప్రగతికి కృషి చేయవలసిన అవసరం ఉందని ఆయన నొక్కివక్కాణించారు.
ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ట్రస్టు సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నదే తమ ఆకాంక్షగా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రవాసాంధ్రులు అంతా పూనుకుంటే అసలు రాష్ట్రంలో దారిద్ర్యం అనేదే ఉండదని ఆయన వ్యాఖ్యానించినప్పుడు యువకులు కరతాళ ధ్వనులు చేశారు.
|