ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలోని తెలుగు సాహిత్య ఫోరం నిర్వహించే 'తెలుగు సాహిత్య వేదిక' రెండో సమావేశం వచ్చే నెల 16వ తేదీన జరుగనుంది. తానా ఆధ్వర్యంలో జరిగిన ఈ తెలుగు సాహిత్య వేదిక తొలి సమావేశం ఈనెల 19వ తేదీన ఇర్విన్లోని ఇండ్యాఫూషన్ రెస్టారెంట్లో జరిగింది. ఈ తెలుగు ఫోరాన్ని గత 2007 జులై నెల 21వ తేదీన ప్రముఖ సినీ రచయితి, పాత్రికేయుడు, నటుడు గొల్లపూడి మారుతీరావు, హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆవుల మంజులతలు ప్రారంభించారు.
ఈ ఫోరం ప్రతి నెలలో మూడో ఆదివారం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే సమావేశం సెప్టెంబరు 16వ తేదీన ఇర్విన్లోని అవర్ ప్లేస్ రెస్టారెంట్లో జరుగుతుందని ప్రసాద్ తోటకూర విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి దేశీయ, అంతర్జాతీయ సాహిత్య ప్రియులను ఆహ్వానించి, వారి అనుభవాలను తెలుసుకుంటారని, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు కూడా తమ సాహిత్య పరిజ్ఞాన్ని పంచుకుంటారని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కేవలం సాహితీ రంగానికి చెందిన అంశాలే కాకుండా.. తమ దైనందిన సమస్యలను కూడా చర్చిస్తారని ప్రసాద్ తోటకూర వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ఆహుతులు తెలుగు సాహితీ ఫోరానికి తమవంతు ఆర్థిక సాయం చేశారు. అనంతరం ప్రసాద్ తోటకూర వందనసమర్పణంతో ఈ కార్యక్రమం ముగిసింది.
|