విజయవాడ నగరంలోని వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో గత శుక్రవారం ప్రారంభమైన "ప్రపంచ తెలుగు మహాసభలు" ఆంధ్ర కళా వైభవాన్ని చాటుతూ ఘనంగా ముగిశాయి. ప్రపంచ తెలుగు సమాఖ్య వారు నిర్వహించిన ఈ ద్వైవార్షిక మహాసభలు ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగాయి. ఈ సభల ఆఖరి రోజైన ఆదివారంనాడు అదరగొట్టే డ్యాన్సులు, గాయకుల పాటలు, హాస్యనటుల ఛలోక్తులు, మిమిక్రీ కళాకారుల పేరడీలతో ముగింపు కార్యక్రమం చాలా సందడిగా మారింది.సినీ హాస్యనటులు బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, గీతాసింగ్, చంద్రమోహన్, సునీల్ శెట్టి, రఘుబాబు, నర్రా వెంకటేశ్వరరావు, రాంజగన్ తదితరులు ఈ ఉత్సవాలకు హాజరై ఆహుతులను నవ్వుల్లో ముంచెత్తారు. సినీ హీరో సాయికుమార్ ఈ ముగింపు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎం.ఎం. శ్రేలేఖ, గీతామాధురి, రఘుకుంచె, శ్రీకృష్ణల పాటలు, శరణ్ గ్రూప్ నృత్యాలను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇకపోతే... ఈ మహాసభలలో ప్రధాన వేదికపై ఆదివారం జరిగిన "పలుకరిస్తే పద్యం" కార్యక్రమం తెలుగు గొప్పదనాన్ని చాటిచెప్పింది. కాగా, ఈ కార్యక్రమాన్ని సింగపూర్ తెలుగు అసోసియేషన్కు చెందిన పేరు వెంకటరమణ ఏర్పాటు చేశారు. ఇందులో.. సభికులు ఇచ్చిన కొన్ని అంశాల ఆధారంగా వేదికపై ఆసీనులైన కవులు ఆసువుగా పద్యాలు పాడి వినిపించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాష్ట్రంలోని అన్ని జిల్లాల యాసలను వినిపించి, సభికుల హర్షధ్వానాలను అందుకున్నారు. అంతేగాకుండా, అ మొదలు ఱ వరకు ఉన్న అక్షరాలు సరస్వతీ దేవి అలంకారాలుగా ఎలా ఉన్నాయో జొన్నవిత్తుల సభికులకు వివరించారు. |