అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వ ప్రధాన సమాచార అధికారి (సీఐఓ)గా గత వారమే నియమితుడైన వివేక్ కుంద్రా నిరవధిక సెలవుపై వెళ్లాలని నిర్ణయించారని వైట్హౌస్ అధికార వర్గాలు వెల్లడించాయి.ఒబామా ప్రభుత్వంలోని సీఐఓ నియామకానికంటే ముందు కుంద్రా కొలంబియా జిల్లా ప్రధాన సాంకేతిక అధికారి (సీటీఓ)గా పనిచేశారు. ఆ కార్యాలయంపై ఎఫ్బీఐ అవినీతికి సంబంధించిన ఒక కేసు విషయమై దాడి చేసి ఇద్దర్ని అరెస్టు చేసింది. వారిలో భారతీయ సంతతి వ్యక్తి అయిన సుశీల్ బన్సాల్ కూడా ఉన్నారు.కాగా, ఈ దాడి పూర్వాపరాలను పరిశీలించిన వైట్హౌస్ వర్గాలు.. వివేక్ కుంద్రా ఎలాంటి తప్పూ చేయలేదని నిర్ధారించాయి. అయినప్పటికీ, కుంద్రా వారం క్రితందాకా తాను పనిచేసిన కార్యాలయంపై ఎఫ్బీఐ దాడి, అరెస్టుల నేపథ్యంలో సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే... వైట్హౌస్ సమాచార ప్రతిని రాబర్ట్ గిబ్స్... కొలంబియా కార్యాలయంపై జరిగిన దాడి విషయమై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. |