భారతదేశంలోని అనాథ పిల్లల చదువుసంధ్యలకు సాయం అందించేందుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ "ప్రథమ్" నిధుల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకున్న పలువురు భారతీయ ప్రముఖులు తమ విరాళాలను అందజేశారు. లక్ష్మీనివాస్ మిట్టల్, ఎంఎఫ్ హుస్సేన్, జీపీ హిందూజా తదితరులు 5 వేల పౌండ్ల చొప్పున విరాళాలను ప్రకటించారు.
ఈ సందర్భంగా హిందూజా గ్రూఫ్ ఛైర్మన్ జీపీ హిందూజా మాట్లాడుతూ... విద్య ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మనిషి సర్వతోముఖాభివృద్ధికి విజ్ఞానం అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ క్రమంలో సాధ్యమైనంతమేరకు తన సహాయ సహకారాలను అందజేస్తానని హిందూజా అన్నారు.
ప్రథమ్ బ్రిటన్ విభాగం ఛైర్మన్ విలాస్ గాడ్కారి మాట్లాడుతూ... ఇప్పటికే తమ సంస్థ 33 లక్షల అనాథ, పేద పిల్లలకు చదువు చెప్పిస్తోందని, 100 మిలియన్ల మంది బాలలకు ప్రాథమిక విద్యను అందించాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. తమ లక్ష్యసాధనలో సాయపడ్డ దాతలకు ఈ సందర్భంగా ఆయన ప్రథమ్ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బ్రిటీష్ దర్శకురాలు స్టీఫెన్ఫియర్స్, గురీందర్ చద్దా, రచయిత హనీఫ్ ఖురేషి, డచ్ బ్యాంక్ ప్రతినిధి అన్షు జైన్, లార్డ్ అండ్ లేడి మిచెల్ తదితరులు పాల్గొన్నారు. 2010 నాటికి భారత్లో వంద మిలియన్ల మంది బాలలకు విద్యనందించే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రథమ్కు మిలియన్ ఫౌండ్ల విరాళాలను సేకరించి ఇస్తామని ఈ మేరకు వారందరూ ప్రతిజ్ఞ చేశారు. |