భారత సంతతి అధికంగా నివసించే టోరంటో శివార్లలోని బ్రాంప్టన్లో ఒక సిక్కు యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపినట్లు పోలీసులు వెల్లడించారు. 33 సంవత్సరాల దేవేందర్ సింగ్ అనే యువకుడు కాల్పులకు గురయినట్లు తమకు సమాచారం అందిందనీ, వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లిన తాము అతడిని ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు తెలిపారు.
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవేందర్ మరణించాడనీ, ఇంట్లో గొడవ సందర్భంగా ఈ కాల్పులు చోటు చేసుకుని ఉండవచ్చునని తాము అనుమానిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే దీనిని మాత్రం వారు ధృవీకరించటం లేదు. ఈకేసులో ఇప్పటిదాకా నిందితులను గుర్తించలేదని, అనుమానితులకు సంబంధించిన ఎలాంచి సమాచారమూ తమ వద్ద లేదని ఓ పోలీసు ఉన్నతాధికారి వివరించారు.
ఇదిలా ఉంటే.. కెనడాలోని బ్రాంప్టన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఇక్కడు సిక్కు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. టొరంటోలోని ముగ్గురు ఎంపీలైన రూబీ దల్లా, గుర్బాక్స్ మల్హీ, నవదీప్ బయాన్స్... తదితర ఎన్నారైలు కూడా ఇదే బ్రాంప్టన్ నగరానికి చెందినవారే కావడం గమనార్హం.