ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » ఐరోపా తెలుగు అసోసియేషన్ సదస్సుకు టీటీడీ ఛైర్మన్ (NRI | Special News | Europe | European Telugu Association Seminar | Tirumala Tirupati Devasthanam)
ఐరోపాలో అక్టోబర్ 9 నుంచి 11వ తేదీల మధ్య వరకు జరుగనున్న యూరోపియన్ తెలుగు అసోసియేషన్ సదస్సుకు.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ ఆదికేశవులు నాయుడిని ప్రతినిధిగా పంపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. బ్రిటన్లోని కింగ్స్ హాల్, డూబ్లే బాలాజీ ఆలయంలో ఈ సమావేశాలు జరుగనున్నాయి.
ఈ మేరకు ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను కలుసుకున్న ఆదికేశవులునాయుడు.. ప్రస్తుతం రాష్ట్రంలో సంభవించిన వరదల ధాటికి సర్వం కోల్పోయిన వరద బాధితులకు టీటీడీ తరపున అందజేస్తున్న సహాయ కార్యక్రమాల గురించి వివరించారు. కర్నూలు, మంత్రాలయం, ఇతర వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను మమ్మురం చేసినట్లు ఆయన ముఖ్యమంత్రికి తెలిపారు.
అలాగే డి.కె. ఆదికేశవులునాయుడు ట్రస్ట్ ద్వారా కూడా మంత్రాలయం పరిసర ప్రాంతాల ప్రజలకు సహాయ సహకారాలను అందిస్తున్నట్లు ఆయన రోశయ్యకు వివరించారు. వరద బాధితుల సహాయార్థం సంస్థలు, ప్రజలు పంపించే వస్తువులను ఉచితంగా రవాణా చేసేందుకు కూడా టీటీడీ సిద్ధంగా ఉందన్నారు. తితిదే ఉద్యోగులు సైతం వారి ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ఆదికేశవులునాయుడు పేర్కొన్నారు.