ప్రధాన పేజి » ఇతరాలు » ఎన్.ఆర్.ఐ. » ప్రత్యేక వార్తలు » బ్రిటన్ వలస నిబంధనలపై సర్వత్రా ఆందోళన (Special News | Visa Rules | Britan Government | Indians | Amit Kapadia | Points-Based System)
యూరోపేతర దేశాల నిపుణులకు వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించటంపై.. సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బ్రిటన్లో పనిచేస్తున్న భారతీయులతో సహా విదేశీయులంతా ప్రభుత్వ ప్రకటనపై మండిపడుతూ అభ్యంతరం తెలియజేస్తున్నారు.
ఈ విషయమై హైలీ స్కిల్డ్ మైగ్రెంట్స్ ఫోరమ్ ప్రతినిధి అమిత్ కపాడియా మాట్లాడుతూ.. ఇప్పుడున్న నిబంధనలను మారుస్తూ బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ బిల్లులో పేర్కొన్న ప్రతిపాదనలు బ్రిటన్లో పనిచేస్తున్న విదేశీ నిపుణులకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఇకపోతే.. విదేశీయులను అనుమతించేందుకు ప్రస్తుతం అవలంభిస్తున్న పాయింట్ల పద్ధతి సరిపోతుందని కపాడియా వ్యాఖ్యానించారు. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయిన విదేశీయులు నూతన వలస నిబంధనలతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని అన్నారు. కాబట్టి.. విదేశీ నిపుణులకు అన్నివిధాలా నష్టం చేకూర్చే తాజా నిబంధనల బిల్లుపై పునరాలోచన చేయాలని కపాడియా బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.