భర్తతో కలిసి అరణ్యానికి వెళుతుంది సావిత్రి. చూస్తుండగానే సంవత్సరకాలం గడిచిపోతుంది. సత్యవంతునికి మరణం ఆసన్నం అవుతున్నదన్న సంగతిని గ్రహించిన సావిత్రి, భర్తతో కలిసి కట్టెలు కొట్టేందుకు అడవిలోకి వెళుతుంది. మధ్యాహ్నానికి కట్టెలు కొట్టి అలసిపోయిన సత్యవంతుడు, సావిత్రి ఒడిలో విశ్రమిస్తాడు. హఠాత్తుగా చీకట్లు కమ్ముకున్నాయి.
చీకట్లను చీల్చుకుంటూ యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. చూస్తుండగానే సత్యవంతుని ఆత్మను యమధర్మరాజు కైవసం చేసుకున్నాడు. వచ్చిన పని పూర్తి చేసుకుని ముందుగా సాగుతున్న యమధర్మరాజు వెంటపడింది సావిత్రి. తన భర్తను తనకు ఇవ్వమని యమధర్మరాజును వేడుకుంది సావిత్రి. పతి ప్రాణాన్ని తప్ప మరేదైనా కోరుకోమని సావిత్రిని ఆదేశిస్తాడు యమధర్మరాజు. సంతానాన్ని ప్రసాదించవలసిందిగా వరమడుగుతుంది సావిత్రి. తథాస్తు అన్నాడు యమధర్మరాజు. తనను వెంటాడుతున్న సావిత్రిని సంగతేమిటని అడుగుతాడు యమధర్మరాజు. పతి లేకుండా సంతానం ఏమిటని లోకం ప్రశ్నిస్తుందని బదులిస్తుంది సావిత్రి..
ఆమె వరంలోని ధర్మసూక్ష్మాన్ని గ్రహించిన యమధర్మరాజు సత్యవంతునికి జీవం పోసి వెడలిపోతాడు. ప్రేమమూర్తి అయిన సావిత్రి, భర్త ప్రాణాల కోసం యమధర్మరాజును వెంటాడిన వైనం లోక ప్రసిద్ధమై ప్రేమజీవులకు ఆదర్శంగా నిలిచింది.
|