-యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు తిరుమల క్షేత్రంలో జరిగే ఉత్సవాల్లో ఊరేగే శ్రీవారిని మలయప్ప స్వామి అని అంటారు. తిరుమల ఆలయంలో మూలవిరాట్ మాత్రమే చలించని ధ్రువమూర్తి. ఈ మూల విరాట్టు కాకుండా కదలడానికి వీలుగా ఏర్పాటు చేయబడిన భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, ఉత్సవ శ్రీనివాసమూర్తి అని పిలువబడే పంచలోహ మూర్తులున్నారు. ఇంకా సుదర్శన చక్రత్తాళ్వార్, శ్రీ సీతారామలక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు మొదలైన పంచలోహ ఉత్సవ విగ్రహాలు గర్భాలయంలో ఉన్నాయి.
పూర్వం ఉత్సవ సమయంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఉపయోగించేవారట. అయితే పదమూడో శతాబ్దంలో జరిగిన ఒకానొక బ్రహ్మోత్సవ సమయంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగుతుండగా కొన్ని భయంకరమైన సంభవాలు ఏర్పడి ఉత్సవాలు ఆగిపోయాయట.
ఆ తర్వాత వేంకటేశుని ఆదేశానుసారం ఏడుకొండలలో మలయప్పకోన అనేచోట కొత్త విగ్రహాలకోసం అన్వేషించి, చివరకు నేలలో నిక్షిప్తమైన వాటిని కనుగొన్నారు. ఆ మూర్తులను తీసుకుని వచ్చి మధ్యలో ఆగిపోయిన బ్రహ్మోత్సవాలను కొనసాగించారు. అంటే తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఈ విగ్రహాలను ఉపయోగించాలన్నది శ్రీవారి ఆదేశం కాబోలు.
మలయప్ప కోన అనబడే ఈ ప్రాంతంలో ఈ మూర్తులు లభ్యమైనందువల్ల ఉత్సవాలలో ఊరేగే శ్రీవారిని మలయప్ప స్వామిగా పిలుస్తారు. ఆనంద నిలయంలో 8 అడుగులు ఎత్తున్న సాలగ్రామమూర్తి మూలవిరాణ్మూర్తి కాగా మూడు అడుగులు ఎత్తున్న పంచలోహ మూర్తి మలయప్ప స్వామి.
భక్తులను తన వద్దకు రప్పించుకుని దర్శనమిచ్చే స్వామి మూలవిరాట్టు(ధృవమూర్తి) కాగా, భక్తుల దగ్గరకు వచ్చి దర్శనమిచ్చే స్వామి మలయప్పస్వామి. అలా శ్రీ మలయప్ప స్వామి తిరుమలలో శ్రీవారి ఆలయం వెలుపల, అంటే బంగారు వాకిలి బయట జరిగే ఉత్సవాల్లోనూ, ఊరేగింపుల్లోనూ, ఆస్థాన సేవల్లోనూ పాల్గొంటూ, భక్తులకు పరమానందాన్ని, భక్తి పారవశ్యాన్ని కలిగిస్తున్నారు.
|