ప్రతి ఏటా కన్నుల పండుగగా జరిగే బ్రహ్మోత్సవాల్లో తిరుమల కొండమీద పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. కొండంతా పూల తోరణాలతో గుభాళిస్తుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్ప, ఫల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుచింది. వివిధ జాతులకు చెందిన 300 రకాల పుష్పాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. పూలతో వివిధ రూపాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. తిరుమల ఆలయం, పరిసర ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాలలో మూడు ఎకరాల విస్తీర్ణంలో పుష్పాలంకరణ చేసారు.
పూలతో శ్రీవారి, పద్మావతి దేవేరుల చిత్రాలు రూపొందించారు. హైదరాబాద్, కోల్కత్తా, కోయంబత్తూరు, బెంగుళూరు, ముంబాయి, చెన్నై ప్రాంతాలకు చెందిన 250 మంది నిపుణులు పుష్పాలంకరణలో పాల్గొని ఉన్నారు. తమిళనాడు కరూర్కు చెందిన వస్త్ర వ్యాపారుల సంఘం బ్రహ్మోత్సవాల పది రోజుల పాటు రోజుకు మూడు టన్నుల వంతున పుష్పాలను స్వామివారికి విరాళంగా ఇస్తున్నారు.
ఈ పుష్ప ప్రదర్శనను రాష్ట్ర మంత్రి జె.రత్నాకర్ రావు ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తితిదే ఈవో కేవీ.రమణాచారి, జేఈవో బలరామయ్య, గార్డెన్ సూపరిండెంట్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
|