ఆపదమొక్కులవాడికి తమ మొక్కులు తీర్చుకునే నిమిత్తం రికార్డు స్థాయిలో లక్షమంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. తొమ్మిదిరోజులపాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి ఐదు రోజులలో నే ఈ రికార్డు నెలకొల్పబడిందని తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి వెంకయ్య గురువారం తెలిపారు.
పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 110 మంది క్షురకులను నియమించినట్లు వెంకయ్య మీడియాతో అన్నారు. వీరిలో 40 మంది మహిళా క్షురకులను నియమించినట్లు ఆయన తెలిపారు. ఇదివరకే 735 మంది సిబ్బంది కళ్యాణకట్ట కేంద్రాలలో తమ విధులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
నూతన నియామకంతో తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదని వెంకయ్య పేర్కొన్నారు. తితిదే మండలి చేపట్టిన నిర్ణయాన్ని అనుసరించి కళ్యాణకట్ట వద్ద భక్తులకు ఉచితంగా చందనపు బిళ్ళలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
|