పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మళ్లీ బ్రహ్మోత్సవాల సందడి నెలకొననుంది. ఈనెల 12వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. దసరా సెలవులు కూడా రావడంతో ఈ బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని టీటీడి అంచనా వేస్తోంది. అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను టీటీడి రద్దు చేసింది. ఈసారి బ్రహ్మోత్సవాలలో బంగారు తేరుపై మాత్రమే శ్రీవారు ఊరేగుతారు. 20వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు భారీ భద్ర తా ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమల మొత్తాన్ని హైసెక్యూరిటీ జోన్గా ప్రకటించారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. తిరుమలలో పలుచోట్ల ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనుంది. భక్తులందరికి అందేలా 3.5 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తోంది. ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు ఉచితంగా అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేసింది. తిరుమలలోని రాంభగీచా వద్ద పుష్ప ప్రదర్శనను నిర్వహించనుంది.
అటవీశాఖ, ఆయుర్వేదం, ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. బాలమురళీకృష్ణ, శోభారాజ్, ఎల్లా వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సిస్టర్స్, విష్ణుభట్ల సిస్టర్స్, హైదరాబాద్ బ్రదర్స్, మాండలిన్ శ్రినివాస్ లాంటి ప్రముఖుల సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను ఈ బ్రహ్మోత్సవాలకు నిర్వహించనున్నారు. అలాగే.. బక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ రోజు వారీ సర్వీసులతో పాటు.. ప్రత్యేక సర్వీసులను కూడా నడపనుంది.
|