ఉత్తరాదిలోని ఝాన్సీకి రాణి అయిన లక్ష్మీభాయ్ 1857 స్వతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ అధికారుల అరచకాలను ఆటకట్టించటానికి నడుం బిగించిన వీరవనిత. యుద్ధరంగంలో తొలివిజయాన్ని సాధించి భారతీయులందరికీ ఆదర్శప్రాయంగా, స్ఫూర్తినిస్తూ 27 సంవత్సరాల ప్రాయంలో సైన్యంకంటే ముందుగా యుద్ధరంగంలోకి చొచ్చుకుపోతూ శత్రువును చావుదెబ్బ తీసిన ధీశాలి ఝాన్సీరాణి.
1828వ సంవత్సరంలో కాశీలో జన్మించిన ఝాన్సీరాణి చిన్ననాడే గుర్రపుస్వారీ, షూటింగ్ వంటి విద్యలను అభ్యసించింది. బాల్యంలో మణికర్ణికగా పిలవబడిన ఝాన్సీరాణి తన నాలుగో ఏటనే తల్లిని కోల్పోయింది. ఇలా ఆమె భారం పూర్తిగా తండ్రిపై పడింది. చిన్ననాటినుంచే తండ్రి ఆమెను ధీరవనితగా తీర్చిదిద్దారు.
1842లో ఝాన్సీకి రాజైన రాజా గంగాధర రావు నెవాల్కర్ను వివాహమాడిన ఝాన్సీ... ఝాన్సీకి రాణి కావటంతోపాటు ఝాన్సీ లక్ష్మీభాయ్గా పిలవబడింది. 1853లో భర్త మహరాజా గంగాధర రావు తీవ్ర అనారోగ్యంపాలై... దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత చేసుకోవాల్సిందిగా కోరాడు. అయితే దానిని బ్రిటిష్ అధికారులు అంగీకరించలేదు. ఆ తర్వాత నవంబరు 23న రాజా గంగాధరరావు మరణించాడు.
దీనితో ఝాన్సీ రాజ్యాన్ని తమకు అప్పగించాలని బ్రిటిష్ పాలకులు ఝాన్సీరాణిని కోరాయి. అయితే దీనికి ఝాన్సీ లక్ష్మీభాయ్ అంగీకరించలేదు. ప్రతిగా ఝాన్సీరాణిని అణచివేసేందుకు అనేక ఎత్తుగడలు వేసింది నాటి బ్రిటిష్ ప్రభుత్వం. అరాచకాలు సృష్టించింది. దీనితో ఝాన్సీ రాణి వారిని ఎదుర్కొనేందుకు తన రాజ్యంలో సైనికులను తయారుచేసింది. బ్రిటిష్ వారిపై తిరగబడింది. తన సత్తాను చూపింది.
|