2007 సంవత్సరంలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఘటనలు హాలీవుడ్ చిత్రాన్ని తలదన్నే రీతిలో ఉన్నాయని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. ఆధునిక యుగంలో సైతం మధ్య యుగపు మనస్తత్వాలకు అద్దంపట్టే సంఘటనలను మనం ప్రత్యక్షంగా చూశాము.
భారత్ పొరుగుదేశాలైన పాకిస్థాన్, మియాన్మార్, నేపాల్ తదితర దేశాలలో రాజకీయపు ఎత్తుగడలను చూసిన మన నేత్రాలు, అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ మరియు ఇరాక్లో చోటు చేసుకున్న నరమేధానికి దుఃఖాశ్రువులను చిందించాయి.
వీటన్నిటి మధ్య బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యాలు గ్లోబల్ వార్మింగ్ తాలూకు దుష్పరిణామాలను కళ్ళకు కట్టినట్లుగా చూపాయి. ఇదేసమయంలో గ్లోబల్ వార్మింగ్ నుంచి జనావళిని కాపాడుకునేందుకు ఉద్దేశించిన జెనీవా సదస్సు అగ్రరాజ్యాల ఆధిపత్య దోరణులతో ఎటువంటి సత్ఫలితాలను సాధించకుండానే అసంపూర్ణంగా ముగిసింది.
సంక్షోభంలో పాకిస్థాన్ : అన్ని వైపులా వ్యతిరేక పవనాలు చుట్టుముట్టడంతో తన పీఠాన్ని కాపాడుకునేందుకు పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, దేశ ప్రజలను అత్యయిక పరిస్థితిలో ఉంచారు. ఎమర్జెన్సీకి మునుపు పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో పునరాగమనం సందర్భంగా కరాచీలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ళను ఎమర్జెన్సీ వాహనానికి ఇంధనంగా వాడుకోవడంలో ముషారఫ్ శాంతి కపోతం పాత్రను సమర్ధవంతంగా పోషించి, అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ళ నడుమ ముషారఫ్ ఎమర్జెన్సీ పాలన అటకెక్కింది.
ఇరాన్-ఉత్తర కొరియా : అమెరికా నుంచి ఏ క్షణంలోనైనా తమపై యుద్ధ మేఘాలు కమ్ముకోవచ్చుననే సంశయం ఇరాన్, ఉత్తర కొరియాలు స్వీయ పరిజ్ఞానంతో అణు కేంద్రాలను నిర్మించుకునేందుకు పురిగొల్పింది. అదే సమయంలో చైనా మరియు రష్యా దేశాల అండదండలు సదా తమ వెంట ఉంటాయన్న ధీమాతో పలు రూపాలలో అమెరికా బెదిరించినప్పటికీ ఉభయ దేశాలు తమ అణు కార్యక్రమాలను విరమించుకోలేదు.
|