కేంద్ర ప్రభుత్వం కోసం ఆర్థిక మంత్రి పి.చిదంబరం పార్లమెంట్లో సమర్పించనున్న బడ్జెట్లో సాధారణంగా దిగుమతి సుంకాలపై అదనపు పన్నును విధించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తామేం తక్కువ తినడంలేదు అన్నట్లుగా అమ్మకపు పన్నుపై సెస్ను జోడిస్తున్నాయి. అదనపు పన్ను లేక సెస్ అనేది అత్యవసర పరిస్థితిలో తాత్కాలికంగా వసూలు చేసే పన్ను మాత్రమే. నిర్దేశిత కాలవ్యవధికి మాత్రమే సెస్ వర్తిస్తుంది.
అడ్డు అదుపూ లేకుండా నిరంతరాయంగా సెస్ భారాన్ని ప్రజలపై ప్రభుత్వాలు మోపే బదులుగా ప్రత్యక్ష పన్నును పెంచడం సబబుగా ఉంటుందని ఆర్థిక రంగ నిపుణలు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాలు తలెత్తిన సమయంలో లేదా శతృ దేశాలతో యుద్ధం అనివార్యమైనప్పుడు ఆర్థికంగా పడే అదనపు భారాన్ని తట్టుకునేందుకు ప్రజలపై సెస్ విధించడం జరిగేది. అత్యవసర పరిస్థితులు తాలూకు పరిణామాలను గుర్తెరిగిన ప్రజలు నిండు మనస్సుతో సెస్ను కట్టేవారు.
సాధారణ పరిస్థితుల్లో సైతం ప్రభుత్వాలు సెస్ దోపిడీకి పాల్పడితే ప్రజల్లో తిరుగుబాటు తలెత్తడం తథ్యం. ప నష్టాల్లో ఉన్నప్పుడు, (ఫ్లుడ్), విదేశాలతో యుద్ధ సమయంలో ప్రభుత్వానికి అధిక రాబడి అవసరం. అటువంటి అత్యవసర సమయంలో తక్కువ సమయానికి అదనపు పన్ను విధించినట్లైతే పన్ను కట్టేవారు సర్దుకుపోతారు. అయితే అదే అదనపు పన్ను భారం కొనసాగించినట్లైతే జనం ఊరుకోరు. పన్ను చెల్లించడం ప్రతి పౌరుని బాధ్యత అంటూ ప్రజలకు కోరే హక్కును ప్రభుత్వం కోల్పోతుంది.
గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో, గుజరాత్ భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అదనపు పన్నును విధించారు. ప్రజలు స్వచ్ఛందంగా చెల్లించారు. అయితే తగిన హేతువు లేకుండా సెస్ తాకిడి నిరంతరాయంగా అమలవుతూ ఉంటే సగటు భారతదేశ పౌరుడు పన్నును చెల్లించే విషయంలో పునరాలోచనలో పడతాడు. 2004-05 బడ్జెట్లో ప్రాథమిక విద్యా వ్యయాన్ని భరించే నిమిత్తం ఆదాయపు పన్నుపై రెండు శాతం సెస్ను విధించారు. 2007-08 ఏడాది ఉన్నత విద్య వ్యయాన్ని భరించే నిమిత్తం ఒక శాతం సెస్ను విధించారు. 1999-2000 బడ్జెట్లో ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు 10 శాతం సెస్ను ప్రజలపై మోపారు.
|