చంద్రునిపై మానవరహిత ఉపగ్రహం పంపాలన్ని భారత్ శాస్త్రజ్ఞుల కల ఈ బుధవారం ఉదయం వంద కోట్లమంది భారతీయుల ఆశల సాక్షిగా సాకారమైంది. మొత్తం మీద అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనా, జపాన్ల తర్వాత చంద్రునిపై మానవరహిత ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టిన ఆరో దేశంగా భారత్ నిలిచింది. శ్రీహరి కోట నుంచి బయలుదేరిన ఈ ఉపగ్రహం.. నిప్పులు చిమ్ముతూ ప్రచండ వేగంతో... అతి పెద్ద ధ్వనిని చేస్తూ నింగిలోకి ప్రవేశించింది.
18.2 నిమిషాల తర్వాత చంద్రయాన్-1 ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. ఇది చాలా సాధారణంగా.. జరిగిపోయిందని.. ఎలాంటి అవరోధాలు లేకుండా.. ప్రయోగం విజయవంతం చేసి భారత్ కొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో ఛైర్మన్ జి. మాధవన్ నాయర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రయోగం విజయవంతం చేసినందుకు శాస్త్రవేత్తల బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సీ11) 44 మీటర్ల పొడవు.. 316 టన్నుల బరువు ఉన్నది.
భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీలు... చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం అవ్వడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఇది ఒక చారిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోతుందని వెల్లడించారు. |