50 వేల యాత్రికులకు వసతి సౌకర్యాలు యాత్రికుల సౌకర్యార్థం వారి స్తోమతను బట్టి ధర్మ సత్రాలు, అతిథి గృహాలు, కాటేజీలు, డార్మిటరీలు, లాకర్లను టిటిడి పెద్ద ఎత్తున కల్పించింది. తిరుమల బస్టాండు సమీపంలోని శ్రీనిపాస కాంప్లెక్స్లో స్నానం చేసేందుకు యాత్రికులకు ఉచిత, నగదు చెల్లింపుతో సౌకర్యాలను టిటిడి కల్పించింది. బస్టాండ్లోనే రూ. 50 లకు టోకెన్ పొందే సౌకర్యం కూడా ఉంది. దీనితో కొద్దిగంటల్లోనే స్వామివారిని భక్తులు దర్శించుకునేందుకు వీలవుతుంది.
తిరుమల లోని యాత్రికుల సౌకర్యాల కేంద్రంలో 22 లాకర్ హాళ్లు ఉన్నాయి. కొండపైన గదులను కోరని యాత్రికుల సౌకర్యార్థం వీటిలో 4300 లాకర్లను అందుబాటులో ఉంచారు. యాత్రికులు తమ విలువైన వస్తువులను, లగేజీని కూడా ఈ లాకర్లలో ఉంచుకోవచ్చు. దర్శనం పూర్తయిన తర్వాత భక్తులు డార్మిటరీలలో గాని, బహిరంగ స్థలంలో కాని నిద్రించవచ్చు. నిద్రపోతున్న భక్తుల వస్తువులను ఎవరూ దొంగిలించకుండా పోలీసుల నిఘా ఉంటుంది.
తిరుమలలో ఉన్న 6 వేల గదుల్లో దాదాపు 5 వేల గదులను ఉచితంగా భక్తులకు ఇస్తారు. తక్కిన గదులను భక్తుల స్తోమత బట్టి అద్దెకిస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు సమాచార కేంద్రాల నుంచి భక్తులు ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునేందుకు 1500 గదులను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ గదులకు అద్దె కింద రూ.100 రూ.150, రూ. 750, రూ. 1000లు వసూలు చేస్తున్నారు.
ఈ సంవత్సరం కౌస్తుభం అతిథి గృహ నిర్మాణం పూర్తి కావస్తుండటంతో టిటిడి వద్ద అదనంగా మరో 224 గదులు లభ్యమయ్యే అవకాశముంది. రాబోయే రెండేళ్ల కాలంలో మరో 35 వేల మంది భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు గాను టిటిడి పలు అతిథ గృహాలలో 1500 గదులను నిర్మించడానికి పునాది రాళ్లు వేసింది. గదుల కోసం మాత్రమే గాక, ప్రత్యేక అతిథి గృహాల నిర్మాణానికి కూడా తమ వద్ద దాతల పథకాలు ఉన్నాయని టిటిడి ఇవో కె.వి. రామాచారి చెప్పారు. స్తోమత ఉన్న వారికి అద్దె గదులు, పేదలకు ఉచిత గదులు ఇవ్వడమే గాక, ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదం, ఉచిత భోజనం వంటి సౌకర్యాలు స్థానిక భక్తులను ఆకర్షిస్తున్నాయి.
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల లగేజీని ఉచితంగా భద్రపరుస్తున్నారు. 24 గంటల పాటు ప్రత్యేక వైద్య సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రతిరోజూ పోగుపడుతున్న 70 టన్నుల చెత్తను తొలగించేందుకు ప్రత్యేకమైన పరిశుభ్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వరుస సౌకర్యాల ప్రభావంతో భారత్ నుంచి విదేశాల నుంచి ప్రత్యేకింది ఆసియా, యూరోపియన్ దేశాల నుంచి అసంఖ్యాకంగా భక్తులు తిరుమలకు వెల్లువెత్తుతున్నారు.
పలు విరాళాల పథకాలు దేవుడి సేవలో పాల్గొనడానికి భక్తులకు కూడా అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో టిటిడి పలు ప్రత్యేక విరాళ పథకాలను అమలు చేస్తోంది. పలువురు భక్తులు స్వచ్ఛంద సేవలో భాగంగా శ్రీవారికి సంబంధించిన పలు సేవలను సమర్పిస్తున్నారు. ఇంకా పలువురు స్వామివారికి బంగారు, నగదు, శాకపాకములు సమర్పించడమే కాక, అతిథి గృహాలను నిర్మించి ఇస్తున్నారు. ఉచిత భోజన, ప్రసాదాలకు విరాళాలు ఇస్తున్నారు.
అన్నిటికంటే మించి తిరుమల ఆలయ ప్రాంగణం మొత్తానికి బంగారు తాపడం చేయాలనే తలంపుతో టిటిడి కొత్త పథకం ప్రారంభించి కొన్ని గంటల్లోపే భక్తులు 50 కేజీల బంగారును సమర్పించడం విశేషం. భక్తుల నుంచి కూరగాయలు, పూలు, ధాన్యాలు, దుస్తులు, రవాణా వాహనాలు, మందులు నిత్యం టిటిడికి అందుతుంటాయి. పైగా రక్తనిధి బ్యాంకులు, ప్రాణదాన పథకం, కృత్రిమ కాళ్ల పథకం, వినికిడి సాధనాలు, కళ్లద్దాలు వంటి పలు విరాళాల పథకాలను టిటిడి చేపట్టింది.
తిరుమలలో దర్శనీయ స్థలాలు శ్రీవారి సందర్శనను మరుపురాని జ్ఞాపకంలా భక్తులు గుర్తుంచుకునేందుకు వీలుగా తిరుమలలో పలు ఆలయ భవనాలను నిర్మించడమే కాకుండా తిరుమల పరిసరాలలో పాపవినాశనం డ్యాం, కళ్యాణి డ్యాం, శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, సహజ శిలాతోరణం వంటి పలు తీర్థ, దర్శనీయ స్థలాలను టిటిడి ఎర్పాటు చేసింది. స్వామి వారి దర్శనానికి ముందు, దర్శనం తర్వాత యాత్రికులు తమ కుటుంబాలతో కలిసి ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా గడిపేందుకు గాను కొండపై అనేక రమణీయ స్థలాలను రూపొందించినట్లుగా టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు చెప్పారు. పైగా టిటిడి తన ప్రచురణలను, సమాచార విభాగాన్ని, ఆన్లైన్ సేవల పథకాన్ని పటిష్టపర్చింది. దీని ఫలితంగా భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత కొద్ది గంటలపాటు తిరుమల పరిసరాల్లోనే సుందర ప్రదేశాలు చూస్తూ తిరుమల సందర్శన స్మృతులను కలకాలం గుర్తు పెట్టుకుంటారని ఆయన తెలిపారు. |