తిరుపతి వెళ్లాము అని చెప్పగానే గల్లీ నుండి ఢిల్లీ దాకా అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే... లడ్డూ ఎక్కడ అని. తిరుపతి లడ్డును పంచడంతోపాటు పుచ్చుకోవడమూ ఓ దర్జానే. వడ నుండి చక్కెర పొంగలి వరకు శ్రీవారి ప్రసాదాలు ఎన్నున్నా... లడ్డూకు మాత్రం తిరుగులేదు. వెంకన్న ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి ‘సంధి నివేదనలు (నైవేద్య వేళలు)’ ఖరారయ్యాయట. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు.