మరాఠా మహారాజు శివాజీ తనయుడు సాహాజీకి (రాజారాం) రక్షణనిచ్చిన ధీరవనిత రాణి చెన్నమ్మ. రాణి చెన్నమ్మకు మరోపేరు కేళడి నాయక రాణి చెన్నమ్మ. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సేనలు తన రాజ్యంపై దాడిచేసినపుడు వీరోచితంగా పోరాడిన యోధురాలు రాణి చెన్నమ్మ.
రాణి చెన్నమ్మ కోటేపురాలో సామాన్య కుటుంబంలో జన్మించారు. అమె తండ్రి సిద్ధప్ప శ్రేష్ఠి. కేళడిలో చెన్నమ్మ చిన్ననాటి నుంచే కత్తిసాము, గుర్రపు స్వారీని నేర్చుకుంది. కర్ణాటకలోని షిమోగా జిల్లా సాగర్ తాలూకాలోని కేళడి ఉంది. ఈ ప్రాంతాన్ని తాకుతూ పవిత్ర తుంగభద్ర నది ప్రవహిస్తుంది. కేళడి వంశం కర్ణాటకలోని మల్నాడ్ ప్రాంతాన్ని పరిపాలించేది. కేళడి రాజులు ఇటు గోవా నుంచి అటు కేరళ వరకూ పరిపాలించేవారు. కేళడి వంశ రాజుల రాజధాని బిదనూర్.
విజయనగర సామ్రాజ్యం విలసిల్లిన కాలంలో కేళడి గ్రామానికి చెందిన బసవ అధిపతిగా వ్యవహరించేవాడు. ఇతని పరిపాలనా తీరును మెచ్చుకుని విజయనగర రాజు సర్వభూమ అతనికి నాయక అనే బిరుదును ఇచ్చాడు. బసవ నాయక కుమారులు, మనుమలు కలిసి సమీపంలోని బీజాపూర్, తుళు, కేరళ ప్రాంతాలను విజయనగర సామ్రాజ్య పరిధిలోకి తీసుకురావడానికి విశేష కృషి జరిపారు.
|