ప్రపంచంలోనే అత్యంత ముదుసలి ఇంటర్నెట్ బ్లాగర్గా పేరొందిన ఆస్ట్రేలియా మహిళ ఓలివ్ రీలే -108- తన చిట్టచివరి బ్లాగ్ సందేశాన్ని పోస్ట్ చేశాక జూలై 13న కన్నుమూశారు. సంతోషదాయకమైన పాటను పాడటం గురించి చివరి పోస్టింగ్ చేశాక ఓలివ్ రీలే పరమ ప్రశాంతంగా గత శనివారం కన్నుమూశారు.
ఓలివ్ మృతిపట్ల ఆమె కుటుంబసభ్యులు మాత్రమే గాక వేలాది ఇంటర్నెట్ స్నేహితులు, వందలాది వంశీకులు ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారని ఆమె వెబ్సైట్ పేర్కొంది. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి రీలై తన బ్లాగులో 70 కొత్త ఎంట్రీలను పోస్ట్ చేయగలిగారంటేనే ఆమె సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
1899 అక్టోబర్ 20న జన్మించిన రీలే రెండు ప్రపంచ యుద్ధకాలాల్లో జీవించారు. వంటమనిషిగా, బార్ సప్లయిర్గా పలు రకాల పనులు చేస్తూ తన ముగ్గురు పిల్లలను ఆమె పెంచి పోషించారు. తను సృష్టించుకున్న బ్లాగులో ఆధునిక జీవితంపై తన అభిప్రాయాల గురించి, 20వ శతాబ్ది పొడవునా తాను పొందిన అనుభవాల గురించి రాస్తూ పోయారు.
జూన్ 26న ఆమె ప్రచురించిన చివరి పోస్ట్లో తాను గత వారంరోజులుగా ఈ నర్సింగ్ హోమ్లో ఉంటున్నాననే విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని రాశారు. ఈ హోమ్లో చాలావరకు తాను పడకమీదే ఉన్నప్పటికీ రోజులు ఎలా గడిచాయో తనకు తెలీటం లేదని, తాను బాగా బలహీనంగా ఉన్నానని, తెరలు తెరలుగా వచ్చే దగ్గు బారినుంచి తేరుకోలేక పోతున్నానని రీలే తన చివరి పోస్టులో రాశారు.
|