భారతదేశంలో మహిళల పురోభివృద్ధి గురించి రాజకీయ నాయకులు చెబుతున్న మాటలన్నీ నీటి మూటలేనని తేలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా లింగభేదం ఎక్కువగా ఉండే 20 దేశాలలో ఒకటిగా మనదేశం కొనసాగుతుండటమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో మనదేశం 6వ స్థానాన్ని సంపాదించుకుని మహిళల పురోభివృద్ధికి ఒక ప్రశ్నార్థకంగా నిలిచింది. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రపంచ లింగభేద నివేదిక-2008 పేరిట పై వివరాలను వెల్లడించింది.ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు, విద్యా సముపార్జన, రాజకీయ సాధికారత లాంటి నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్న పరిశీలకులు, వీటిలో మెరుగైన పనితీరు ఆధారంగా 130 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో భారత్కు 113వ స్థానం లభించడంతో పనితీరు మరీ అధ్వాన్నంగా ఉండే చివరి 20 దేశాల సరసన కూడా భారత్ నిలిచిపోయింది.గత సంవత్సరం పై విషయాలలో నార్వే మూడవస్థానంలో ఉండగా, ప్రస్తుతం మొదటి స్థానానికి చేరుకుంది. ఆ తరువాత ఫీన్లాండ్, స్వీడన్, ఐస్ల్యాండ్, న్యూజలాండ్, ఫిలిఫ్పీన్స్, డెన్మార్క్, ఐర్లాండ్, నెదరల్యాండ్స్, లాత్వియాలు వరుసగా మొదటి పది స్థానాల్లో నిలిచాయి.క్రితం ఏడాది 114వ స్థానంలో నిలిచిన భారత్ ఈసారి మాత్రం తన పనితీరును మెరుగుపరచుకుని ఒక్క స్థానం పైకెగబాకడమే కొద్దిగా ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. రాజకీయ సాధికారతలో సగటు కంటే, కొంత మెరుగైన వృద్ధిని సాధించిన భారత్ లింగభేదం విషయంలో మాత్రం 6వ స్థానంలో నిలవడం మాత్రం విచారించదగ్గ అంశం. |