ముస్సోరిలోని ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీ చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడూ జరగని ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ అకాడమీ ఏ బ్యాచ్లోనూ లేనంత మంది మహిళా ఐఏఎస్ ట్రైనీలు, ఈ ఏడాది బ్యాచ్లలో ఉండటమే ఈ అరుదైన రికార్డుకు కారణం.ఈ విషయమై ముస్సోరి ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ గంగాధరన్ మీడియా ప్రతినిధులకు వివరాలందజేస్తూ... తమ అకాడమీలో ఈ సంవత్సరం 32 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు. తమ అకాడమీ చరిత్రలో ఒకే బ్యాచ్లో ఇంతమంది మహిళలు శిక్షణ పొందటం ఇదే మొదటిసారని అన్నారు.వీరిని ఆదర్శంగా, స్పూర్తిగా తీసుకుని మరింతమంది గ్రామీణ నేపథ్యం ఉన్న యువతులు ఐఏఎస్కు వచ్చే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని గంగాధరన్ చెప్పారు. ప్రస్తుతం ఐఏఎస్పై ఆసక్తి చూపిస్తోన్న యువతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని, మునుముందు ఇది సగానికి సగం నిష్పత్తికి చేరినా ఆశ్చర్యపోవాల్సింది లేదని ఆయన జోస్యం చెప్పారు." ఆకాశంలో సగం, భూమి మీద సగం" అన్న వాక్యానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్న ఈ మహిళా ఐఏఎస్ల కఠిన దీక్షను ఈ సందర్భంగా మెచ్చుకోకుండా ఉండలేం. అన్నిరంగాలలోనూ పురుషులతో పాటు సమానంగా పోటీపడుతున్న మహిళామణులు ప్రస్తుతం ఎంతోమంది ఉన్నారు. అలాంటి కోవలోకే చెందిన ఈ మహిళా ఐఏఎస్ ట్రైనీలు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ఈ దేశానికి, సమాజానికి నిజాయితీగా సేవ చేయాలని మనసారా కోరుకుందాం..! |