ఆశ్చర్యపోతున్నారా...? నేటి ఆధునిక కాలంలో అమ్మానాన్నలు, అత్తామామలను వీడి వేరు కాపురాలను పెట్టుకునేవాళ్లే అదృష్టవంతులంటున్నారు పరిశోధకులు. ఒకవేళ ఉమ్మడి కుటుంబంలో కాలం వెళ్లదీస్తే ఆ కుటుంబాలలోని స్త్రీలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయంటున్నారు. ఇదేమి చిత్రం...? అని మనం అనుకోవచ్చు. కానీ రుజువులతో కూడిన వివరాలను వారు అందిస్తున్నారు. సుదీర్ఘ కాలంపాటు ఉమ్మడి కుటుంబంలో జీవనం సాగించే మహిళల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మూడింతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. అధ్యయనంలో భాగంగా వారు 40 మరియు 69 ఏళ్ల మధ్యగల వయసున్న జపాన్ మహిళలను 91 వేలమందిని ఎంపిక చేశారు. 1990- 04 మధ్య చేపట్టిన అధ్యయనంలో వీరి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారికి ఎటువంటి అనారోగ్యం లేదు. క్యాన్సర్, గుండె జబ్బులు తదితర వ్యాధులు ఏ ఒక్కరికీ లేవని నిర్థారించుకున్నారు. కుటుంబ వివరాలు, జీవన విధానం, ఉమ్మడి కుటుంబాలతో జీవనం, వ్యక్తిగత వివరాలు... తదితర అంశాలను నమోదు చేసుకున్నారు. పదేళ్ల తర్వాత... అంటే 2004లో చూస్తే... మొత్తం 91వేల మందిలో 671 మంది మహిళలు కొత్తగా గుండె జబ్బుల బారినపడినట్లు తేలింది. 339 మంది మహిళలు హృదయ సంబంధిత వ్యాధులతో మరణించారు. మరో 6వేల 255 మంది ఇతర కారణాల వల్ల మృతి చెందారు. చనిపోయినవారు, గుండె జబ్బులకు గురైన మహిళల జీవన స్థితిగతులను చూస్తే... వారంతా ఉమ్మడి కుటుంబాల్లోనో లేదంటే తమ పిల్లలు, మనవలు, మనవరాండ్రతోనో ఉన్నట్లు తేలింది. కేవలం భర్తతో కలసి ఉన్నవారిలో అధికులకు ఎటువంటి రుగ్మతలు దరిచేరలేదు. మొత్తమ్మీద చూస్తే... అమ్మానాన్న లేదంటే అత్తామామలతో కలసి కాలం గడిపే ఉమ్మడిగా జీవనం సాగించే మహిళలకు ఒత్తిళ్లు ఎక్కువనీ, ఫలితంగానే వారు గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడుతున్నారని తేలింది. |