నవమాసాలు కని పెంచి పెద్ద చేసిన మాతృమూర్తులతో కీచులాటలకు యుక్తవయస్సు అమ్మాయిలు సై అంటున్నారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఎదిగిన పిల్లల్లో చాలామంది తల్లిదండ్రులతో పోట్లాటలకు సిద్ధపడుతుండగా... ముఖ్యంగా అమ్మాయిలు అమ్మలపై వాగ్యుద్ధానికి సై అంటుంటే... అబ్బాయిలు మాత్రం బుద్ధిగా వ్యవహరించి, గొడవలకు దూరంగా ఉంటున్నట్లు పై అధ్యయనం విశ్లేషించింది.అమెరికాకు చెందిన మిచిగన్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయనంలో... కడుపుతీపి ఘర్షణలవల్ల పిల్లలకంటే, పెద్దవారే ఎక్కువగా చికాకులకు లోనవుతున్నట్లు వెల్లడైంది. దాదాపు 474 మంది తల్లిదండ్రులు, 22 సంవత్సరాలు దాటిన యుక్తవయస్కులపై జరిపిన ఈ సర్వే ఆధారంగా పరిశోధకులు పై అభిప్రాయానికి వచ్చారు.ఈ సర్వేలో పాల్గొన్న కిరా బిర్డిట్ మాట్లాడుతూ... మనుషులు ఏర్పరచుకున్న సంబంధాలలో సంతానంపై ప్రేమ దీర్ఘకాలం నిలిచే అనుబంధమనీ.. అయితే, ఇది చాలాసార్లు సానుకూల ఫలితాలనే ఇచ్చినప్పటికీ... కొన్నిసార్లు మాత్రం చిర్రెత్తటం, ఒత్తిడికి లోను కావడం లాంటి సమస్యలు ఉత్పన్నమవ్వచ్చని పేర్కొన్నారు.పిల్లల ఆర్థిక ఇబ్బందులు, ఇంటిని శుభ్రంగా ఉంచే తీరు, గత సంబంధాల్లో సమస్యలు, జీవనశైలి, ఇంటికి దూరంగా ఉంటున్న పిల్లలను తల్లిదండ్రులు ఎన్నిసార్లు కలుసుకుంటున్నారన్న.. విషయాలను పై సర్వేలో పరిగణనలోకి తీసుకున్నట్లు బిర్డిట్ వివరించారు. తమ పరిశోధనలో ఒత్తిళ్ల కారణంగా పిల్లల కంటే, వారిని కన్నవారే ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నట్లు తేలిందని చెప్పారు.ఇదిలా ఉంటే... మగ పిల్లల కంటే, అమ్మాయిల తీరుపైనే తల్లిదండ్రులు ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నట్లు తమ సర్వేలో పసిగట్టామని చెప్పారు. అయితే, సహజంగానే అమ్మాయిలు కన్నవారితో చనువుగా ఉండటం వల్ల ఎక్కువగా సాన్నిహిత్యం ఏర్పడుతుందనీ, దగ్గరితనంవల్ల కొన్నిసార్లు వారు విభేదించే అవకాశం ఉండటమే దీనికి కారణంగా ఉండవచ్చని బిర్డిట్ పేర్కొన్నారు.అలాగే.. తమ సర్వేలో పిల్లలందరూ ఏకగ్రీవంగా అమ్మలపైనే ఎక్కువగా ఫిర్యాదులు చేశారని బిర్డిట్ వివరించారు. కాగా... పిల్లలు తమతో చనువుగా మసలటం వల్ల సహజంగానే అమ్మ మనసు వారి నుంచి ఎక్కువగా ఆశించటమే ఇందుకు కారణం కావచ్చని తమ పరిశోధకులు అంచనా వేశారని బిర్డిట్ స్పష్టం చేశారు. కాబట్టి... అమ్మమనసును అర్థం చేసుకుని యుక్త వయస్సు అమ్మాయిలు పేచీలు పడకుండా, ప్రేమగా ఉంటారు కదూ...!! |