నేడు ఎక్కడ చూసినా కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్యం ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు కాలుష్యాన్ని నివారించమని గగ్గోలు పెడుతున్నారు. మన చుట్టూ కాలుష్యం ఆవరించి ఉందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రధానంగా కాలుష్యం నాలుగు రకాలు. అవేంటంటే 1. భూ కాలుష్యం, 2. వాయు కాలుష్యం, 3. నీటి కాలుష్యం, 4. ధ్వని కాలుష్యం. ఇలా ప్రతిదీ కాలుష్యంతో ముడి పడి ఉంది.
ఎక్కడైతే ఎక్కువ సమయం గడుపుతామో అక్కడే ఎక్కువ కాలుష్యం ఉంది. అదేనండి మన ఇల్లు. ఇంట్లో కాలుష్యం పేరుకుపోతుంటే కూడా మనం దానిని లెక్క చేయం. ఆ కాలుష్య ప్రభావం ఏంటో తెలుసుకుందాం...
** ఇంట్లోని ప్రధానమైన గది వంట గది. ఈ వంట గదిలో షింక్ ఉంటుంది. ఈ షింక్ను ప్రతి రెండు రోజులకు ఒకసారి శుభ్రం చేసుకుంటుండాలి. లేకుంటే అందులో ఫంగస్ ఏర్పడి ఆరోగ్యానికి ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే షింక్లో నీటి ప్రవాహం, అలాగే షింక్ లోపల ఫంగస్ ఏర్పడుతుంది. ఈ ఫంగస్ కారణంగా అనారోగ్యంబారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
వంట గదిలో ప్రస్తుతం గ్యాస్ వాడని వారు ఎవ్వరూ లేరు. ఇది సర్వసాధారణమైంది. ప్రతి నిత్యం వాడే స్టౌలలో గ్యాస్ వాడకం తప్పనిసరి అయిన నేటి రోజులలో మీరు వాడే స్టౌను వారానికి ఒకసారి శుభ్ర పరచండి. దీంతో మీరు వాడే గ్యాస్ ఆదా అవుతుంది. అలాగే అందులోనుంచి మంటకూడా వేగవంతంగా వచ్చి వంట త్వరగా పూర్తవుతుంది. వంట గదికి వెంటిలేషన్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా వంటగది శుభ్రంగా లేకపోతే ఇంట్లో దోమలు, చీమలు, బొద్దింకలకు మీరు ఆహ్వానం పలికినట్లే. ఇలాంటి క్రిమి, కీటకాలను నాశనం చేయడానికి తగిన మందులు, స్ప్రే వాడుతుంటారు. ఇలాంటివి ఇంట్లో ఉంచుకోవడం సర్వ సాధారణం. కాని వీటిని పిల్లలకు అందేలాగా ఉంచకండి. |