భారతదేశపు ప్రప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూకు స్వయానా సోదరి. ప్రముఖ విద్యావేత్త, రచయిత, మహిళా నాయకురాలుగా ఎదిగిన మహిళ విజయలక్ష్మీ పండిట్ దేశంలోని మహిళలకు ఆదర్శంగా నిలిచారు. నేడు ఆమె జన్మదినం.
అలహాబాద్లో తే 18.8.1900ది నాడు మోతీలాల్ నెహ్రూ దంపతులకు పుట్టిన గారాలపట్టి పండిట్ విజయలక్ష్మీ. ఈమె అసలు పేరు స్వరూప్కుమారి నెహ్రూ. మహిళలు చదువుకోకూడదన్న కఠినమైన నిబంధనలున్న ఆ రోజుల్లోనే ఆమెను ఉన్నతమైన చదువులు చదివించారు మోతీలాల్ నెహ్రూ.
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే బ్రిటీష్- ఇండియా ప్రభుత్వంలో జరిగిన సాధారణ ఎన్నికలలో ప్రజాప్రతినిధిగా ఎంపికై తొలి భారత మహిళా మంత్రిగా ఆమె చరిత్ర పుటలలోకి ఎక్కారు. స్వదేశంలోనేగాక ఆమె విదేశాలలోనూ తొలి భారత మహిళా రాయబారిగా అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ దేశాలకు పనిచేశారు.
జవహర్లాల్ నెహ్రూ, విజయలక్ష్మీపండిట్ ఒక మొక్కకు పూచిన రెండు పువ్వులు. తండ్రి మోతీలాల్ నెహ్రూ విజయలక్ష్మిని కుమారునితో సమానంగా పెంచాడు. ఆ రోజుల్లోనే మహిళా స్వేచ్ఛకు మోతీలాల్ ఎంతో విలువనిచ్చాడు. ఈమె తన తండ్రి దిశానిర్దేశాలతో చిన్నప్పటినుంచే పట్టుదల, దీక్ష, దృఢసంకల్పంతో పెరిగారు. ఆడవారు చదువుకునే వీలుకాని పరిస్థితిలో సైతం ఆమె పట్టుబట్టి ఉన్నత చదువులు చదివారు.