మనిషి సంఘజీవి. ఈ విషయం జగమెరిగిన సత్యం. కలసివుంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. కాని నేడు మనిషి తన స్వార్థంతో తనకు తానుగా తన చుట్టూ కాంక్రీట్ నిర్మాణాన్ని నిర్మించుకుంటున్నాడు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు తప్ప తన వాళ్లు గుర్తుకు రావట్లేదు.
ఆతర్వాత పశ్చాత్తాపం చెందడం నేడు సర్వసాధారణమై పోయింది. ఈ యాంత్రిక జీవనంలో తనూ ఓ యంత్రంలా మారిపోయాడు మనిషి. మనీతోనే సంబంధం అని మనిషి తనలోని మానవత్వాన్ని మరచి బంధాలను తెంచేసుకుంటున్నాడు.
దీంతో కన్నవాళ్లను కూడా కాదనుకుని రెక్కలొచ్చిన పక్షిలాగా ఎగిరిపోతున్నాడు. తమ పిల్లలకు వారి బంధువలను తమవద్దవున్న ఫోటోలద్వారా పరిచయం చేసుకునే పరిస్థితి దాపురించింది.
* బంధాలు సన్నని దారంలాంటివి. ఆ దారం తెగితే మళ్లీ ముడివెయ్యాలంటే అది సహజంగా వుండదు. అలాంటిదే ఈ మానవ సంబంధాలు. ఈ బంధాలుకూడా ఎన్నో ఏళ్లతరబడి కొనసాగినా కాసింత మాట పట్టింపువల్ల బెడిసికొట్టే పరిస్థితి తలెత్తకూడదు.
* బంధాలలో అపనమ్మకాలు ఉండకూడదు. అపనమ్మకంవుంటే ఆటుపోట్లు తప్పవు. * బంధాలు తెగిపోయినప్పుడు మానసిక క్షోభ తీవ్రాతితీవ్రంగావుంటుంది. నిరాశా నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. కాని ముందుగానే మానసికంగా బంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూవస్తే ఏ సమస్యావుండదంటున్నారు మానసికవైద్యనిపుణులు. * మనకెవరిపైనైనా ఇష్టం కలిగినప్పుడు వారి ప్రేమ బంధంలో ఇమిడి పోవాలనిపిస్తుంది. ఈ బంధం ఎంత త్వరగా గట్టిపడుతుందో అంతే త్వరగా విడిపోయే ప్రమాదంవుంది. అది వారిపట్లవున్న ఆకర్షణ మాత్రమే తప్ప నిజమైన ప్రేమ ఏ మాత్రం కాదంటున్నారు విశ్లేషకులు. |