ఏం చేయాలి? భోంచేసిన తర్వాత కూర్చుండిపోవటం, పరుండటం కంటే మించిన ప్రమాదం శరీరానికి మరొకటి లేదని వైద్యుల ఉవాచ. కాబట్టి తిన్న తర్వాత కనీసం పది నిమిషాలపాటు ఆటూ ఇటూ తిరగాలని వైద్యులు అంటున్నారు.
ఒకప్పుడు పల్లెల్లో రాత్రిపూట తిండి తిన్నాక పిల్లలను ఇంటి చుట్టూ లేదా పల్లెదారుల వెంబడి పచార్లు చేయమని పెద్దలు పనిగట్టుకుని ఇంట్లోంచి బయటకు తోలేవారు. ఈ అలవాటు పట్నాల్లో లేకపోవటం లేదా తింటూనే పుస్తకాలు పట్టుకోవడమో, టీవీలు, కంప్యూటర్ల జోలికి పోవడమే చేస్తున్నారు కనుక బాల్యం నుంచే ఇప్పుడు ఊబకాయం మనల్ని ఆహ్వానిస్తోంది. ఇది జరగకుండా ఉండాలంటే....
నడక, పరుగు, ఈత, సైక్లింగ్, వంటి ఏదైనా ఒక ఎక్సర్సైజును రోజుకు ముప్పై నిమిషాల పాటు తప్పనిసరిగా చేయాలి. భోంచేస్తూనే కూర్చోవడం, పడుకోవడం ఎంత ప్రమాదకరమో, అయిందానికి, కానిదానికి వాహనం ఉపయోగించడం అంతకంటే ప్రమాదకరం. అందుకే దగ్గర ప్రాంతాలకు వెళ్లాలంటే నడకతే ప్రాధాన్యమివ్వండి.
ఇంట్లో పనులు స్వయంగా చేసుకోవడం కూడా మహిళలను చురుగ్గా ఉంచుతుంది.
రోజంతా పని ఒత్తిడితో శరీరం అలసటకు లోనైతే విశ్రాంతిగా కూర్చోండి. సూర్యోదయం వేళ లేలేత కిరణాలు ప్రసరిస్తున్నప్పుడు ప్రశాంత వాతావరణంలో కాస్సేపు విశ్రాంతిగా కూర్చోండి. ధ్యానం, ప్రాణాయామం వంటివి ఎంత గొప్ప అనుభూతినిస్తాయో స్వయంగా చేసి ఆస్వాదించండి.
ప్రతిరోజూ 2 నుంచి 3 లీటర్ల నీటిని కనీసంగా అయినా తాగాలి. ముఖ్యంగా ఏసీ ఉన్న చోట పని చేస్తున్నట్లయితే గంట గంటకూ నీళ్లు తాగడం అవసరం. నాలుక తడారిపోయేలా చేసే ఏసీ వాతావరణానికి మంచినీరు చక్కటి విరుగుడు.
ఎంత సేపు నిద్రపోవాలి? కోడి నిద్ర కోళ్లకు పనికొస్తుందేమో గాని మనుషులకు పనికిరాదు. జాము జాముకూ నిద్ర లేచి కొక్కొరొక్కో అని అరవటం కోడి లైఫ్ స్టైల్ కాగా మనుషులకు ఈ తరహా స్టైల్ పనికిరాదు. మహిళలకు అసలే పనికిరాదు. లేచింది మొదలు నిద్రపోయేవరకూ పనుల్లో మునిగితేలే మహిళలు కనీసం 7 గంటలయినా నిద్రపోకపోతే వారి శారీరక మానసిక ఆరోగ్యం కుదేలయిపోతుంది. అదీ కోడి నిద్ర కాకుండా గాఢ నిద్ర.. పడుకుంటే తిరిగి మెలకువ వచ్చేంతవరకూ స్పృహలేకుండా ఉండేరకం నిద్ర మహిళలకు చాలా అవసరం. అయితే తిండి, నిద్ర, వ్యాయామం మూడింటిలోనూ సమయపాలన పాటించడం చాలా అవసరం. |