అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకులో సుమారు 20వేల క్లిరికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దక్షిణాదికి సంబంధించినంత వరకు హైదరాబాద్ రీజియన్ పరిధిలో 1856, చెన్నై రీజియన్ పరిధిలో 1183, బెంగుళూరు రీజియన్ పరిధిలో 1128, త్రివేండ్రం రీజియన్ పరిధిలో 735 పోస్టులున్నాయి.
ప్రాంతాల వారీగా సిబ్బందిని ఎంపికచేయనున్నందున మీరు ఎంచుకునే ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతం పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో పోటీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అంతేకాక ఎంపికయితే పదేళ్ల వరకు ఆ ప్రాంతం పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1.7.08 నాటికి 18-నుంచి 28 ఏళ్ల లోపు వయసు కలిగి, ఇంటర్లో అరవై శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ, మాజీ సైనికోద్యోగులు 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
పట్టభద్రుల్లో సాధారణంగా అయితే నలభై శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ, మాజీ సైనికోద్యోగులకైతే ఉత్తీర్ణ మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే వారికి రూ. 4410-13210 ప్రాతిపదిన పే స్కేల్ ఉంటుంది. జులై 6న జరిగే ఈ పరీక్షకోసం మే 31లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలోనూ, తమిళనాడులోని చెన్నై, తిరుచ్చి, మదురై, కోయంబుత్తూరు, కర్ణాటకలోని బెంగుళూరు, మైసూరు, హుబ్లి, గుల్బర్గా, మంగళూరు, కేరళలోని కోళిక్కోడు, కొచ్చి, త్రివేండ్రం, కొట్టాయంలతో పాటు పాండిచ్చేరిలో కూడా ఈ పరీక్షలు జరుగనున్నాయి.
జనరల్ నాలెడ్జి, జనరల్ ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, మార్కెటింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించే రీతిలో ప్రశ్నలుంటాయి.
దీనికి సంబంధించిన వివరాలను భారతీయ స్టేట్ బ్యాంకు వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. పరీక్ష రుసుం రూ. 250లను బ్యాంకుల్లో చెల్లించి, ఆన్లైన్ ద్వారానే దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
|