వాహన నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న టాటా మోటార్స్ సంస్థ కొత్తగా రూపొందిస్తున్న మధ్యతరగతి ప్రజల కారు నానో కారుకు సంబంధించి ఈ వారంలోనే వినియోగదారులకు అలాట్మెంట్ లెటర్లు అందనున్నాయి. ఈ లెటర్లను అందుకోబోయే ప్రజలు ఎక్కువగా చిన్న పట్టణాలు, గ్రామాలో నివసించేవారై ఉంటారని కంపెనీ భావిస్తోంది.నానో కారుకోసం దాదాపు రెండు లక్షల మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 30శాతం ప్రజలు మాత్రమే మెట్రో నగరాలలోని వారని కంపెనీ తెలిపింది. నానో కారు బుకింగ్ 2009 ఏప్రిల్ నెల 25వ తేదీకి ముగిసింది. టాటా మోటార్స్ సంస్థ రూపొందించిన ప్రణాళికలననుసరించి జులై నెలనుంచి వినియోగదారులకు తమ కారును అందించాలి. ఆ తర్వాత మిగిలిన వారికి రానున్న ఆర్థిక సంవత్సరాంతానికి వినియోగదారులకు దశలవారిగా అందించనుంది. తమ కంపెనీ తొలుత ప్రకటించిన విధంగానే ఒక లక్ష కార్లను కంప్యూటరైజ్డ్ లాటరీ విధానం ద్వారా అందజేయనుంది. మిగిలినవారికి ఓ అవకాశం ఇవ్వనుంది. అదేంటంటే నానో కారు కావలసినవారు తమ సొమ్మును అలాగే ఉంచితే వారికి ఆ సొమ్ముపై వడ్డీ లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. కొత్త కార్లను రూపొందించిన తర్వాత వారికికూడా కార్లను అందిస్తామని కంపెనీ తెలిపింది. కాని ఇలా లాటరీలో రానివారు అధిక ధర చెల్లించాల్సి ఉంటుందని, ప్రస్తుతం నానో కారు ధర ఒక లక్షరూపాయలేనని కంపెనీ తెలిపింది. అదికూడా ఈ ధర ఒక లక్ష కార్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ గతంలోనే ప్రకటించింది. మిగిలిన వినియోగదారులకు ఈ ధర వర్తిస్తుందా లేదా అనేది ఇంకా కంపెనీ ప్రకటించలేదు. కాగా పెరిగిన ధర ఎంత అనేదికూడా కంపెనీ ఇంతవరకు స్పష్టం చేయకపోవడం గమనార్హం. నానో కారును బుక్ చేసినవారి గురించి వివరాలను సేకరిస్తే తెలిసిన విషయం ఏంటంటే... ఇంతవరకు కారును బుక్ చేసినవారిలో 50శాతం సభ్యులు టాప్ అండ్ ఎల్ఎక్స్ వేరియంట్ మోడల్ను బుక్ చేసారు. అదే ఇరవై శాతంమంది బేస్ మోడల్ కొరకు బుక్ చేసుకోగా, మిగిలిన 30 శాతంమంది మధ్యస్తమైన మోడల్ సీఎక్స్ కొరకు బుక్ చేసినారని తెలిసింది. ఇదిలావుండగా ప్రజలు అతి చవకకే కారును కోరుకుంటున్నారు. ఇలాంటి చవకైనకారులో అన్ని రకాల సౌకర్యాలుంటే మరీ సంతోషం. అది నానోకారు అందిస్తుందని ప్రజలు ఆశగా ఆ కారుకోసం ఎదురు చూస్తున్నారు. |