అంతర్జాతీయస్థాయిలో నెలకొన్న ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమౌతున్న నేటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా చితికిపోయిన బ్యాంక్లు, కంపెనీలు ఓ వైపు మూతపడుతుంటే మన దేశంలో యువత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాలలో యువత దీనిపై పెద్దగా స్పందించిన దాఖలాలు కనపడటంలేదు. నిత్యం తమ పనులతోపాటు, మనోరంజకమైన కార్యక్రమాలలో మునిగి తేలుతున్నారు. ఇందులో ప్రత్యేకంగా యువత మద్యం మత్తులో జోగుతున్నట్లు ప్రాథమిక సర్వేలు చెపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మనదేశంలో ఈ మధ్య ఐటీ రంగం ఊపందుకోవడంతో యువత చేతిలో డబ్బులు విపరీతంగా వచ్చి పడింది. ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంద్యం ఛాయలు ఊహించినదానికంటే ఎక్కువగానే కనిపిస్తున్నప్పటికీ మరోవైపు తినడం, తాగడం, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడినవారు తమ పద్ధతులు, అలవాట్లను ఏ మాత్రం మార్చుకోలేదు. పైగా తమ రోజువారీ ఖర్చులను ఎంతోకొంతమేర పెంచారుకూడా. గత ఆరు సంవత్సరాలుగా మనదేశంలో ఆర్థికపరమైన విధానాల్లో వృద్ధి సాధిస్తూ వస్తున్నాకూడా మద్యం సేవించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని లెక్కలు చెపుతున్నాయి. అలాగే ఖరీదైన కార్లను కొనడం, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని భారత్లోని యువత ఆర్థికమాంద్యం గురించి ఎలాంటి ఆలోచనలు చేయడంలేదని ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. మనదేశంలో కార్ల విక్రయాలు అనుకున్న స్థాయిలో లేనప్పటికీ యుకెకు చెందిన అతి ఖరీదైన కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. వీటితోపాటు ఖరీదైన దుస్తులు, ఆభరణాలు, వైన్, బీరు విక్రయాలు పెరిగాయనే చెప్పాలి. సాధారణంగా మనదేశంలో విస్కీ విక్రయాలే ఎక్కువైనప్పటికీ ఇటీవలకాలంలో బీరు అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా యువత బీరుకోసం తెగ ఆరాటపడుతున్నారు. గత ఏడాది 4 కోట్ల 40 లక్షల లీటర్ల బీరు మార్కెట్లో అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. లిటిల్ డెవిల్స్ బ్రాండ్కు చెందిన ఐదు రకాల బీర్లు ఇటీవలే మార్కెట్లోకి వచ్చాయి, ఇతర బ్రాండ్ల బీర్ల కంటే ఇప్పుడు వీటికే మార్కెట్ ఎక్కువని టివిబి గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ హబీబ్ కమాల్ తెలిపారు. బీరు అమ్మకాలతోపాటు సైడ్ డిష్గా తీసుకునే ఆహారం చిరుతిళ్ళు, కబాబ్లు, బిర్యానీల విక్రయాలు కూడా బాగానే పెరిగాయి. ప్రజల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ బీరు అమ్మకాలకు ఏ మాత్రం కొదవ లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో నీటికి కొదవ ఉందేమోకాని, మందుకుమాత్రం కొదవలేదనేది సత్యం. దీంతో యువత పెడదోవనపడుతోందని ఆ సర్వే పత్రిక తెలిపింది. |