డీజిల్ కార్లపై "పన్ను"తో భారీగా పిండుకునేందుకు కసరత్తు
శుక్రవారం, 27 జనవరి 2012( 13:31 IST )
ఇప్పుడు ప్రభుత్వం కన్ను డీజిల్ కార్లపై పడింది. వాటిపై కూడా మరిన్ని పన్నులతో మోత మోగించడానికి సిద్ధమవుతోంది. రానున్న బడ్జెట్లో వీటిపై భారీ ఎత్తున కేంద్ర ఆర్థిక శాఖ ఎక్సైజ్ సుంకాన్ని పెంచే దిశగా కసరత్తు చేస్తోంది. ఇక వ్యక్తిగత వాహనాలకు వాడే డీజిల్ వాడకం కొంతైనా తగ్గి ఆ మేరకు సబ్సిడీ భారం కూడా తగ్గొచ్చని భావిస్తోంది.
ఈ ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోన్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. దీనిపై వివిధ శాఖల్లో భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకాలను పెంచాలని చమురు శాఖ కోరుతుండగా.. భారీ పరిశ్రమల శాఖ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పన్ను పెంపు ద్వారా అదనంగా వచ్చిన నిధులను సబ్సిడీ రేటుకి డీజిల్ అమ్మడం మూలంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వస్తున్న నష్టాలను కొంతైనా భర్తీ చేసేందుకు ఉపయోగపడతాయని చమురు శాఖ భావిస్తోంది.
ఎకానమీలో డీజిల్ వాడకం పెరగకుండా అధిక సుంకాల వ్యూహం పనికొస్తుందని పేర్కొంటోంది. ప్రస్తుతం 1500 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో నాలుగు మీటర్ల దాకా పొడవున్న డీజిల్ కార్లపై 10 శాతం ఎక్సైజ్ సుంకం ఉంది. అంతకు మించితే 22 శాతం ఎక్సైజ్ సుంకంతో పాటు రూ. 15,000 అదనంగా చెల్లించాల్సి ఉంటోంది. డీజిల్ రేట్లపై నియంత్రణ కారణంగా దిగుమతి చేసుకున్న ధర కంటే తక్కువగా ఆయిల్ కంపెనీలు దీన్ని విక్రయించాల్సి వస్తోంది.
దేశీయంగా రవాణా అవసరాల కోసమే కాకుండా లగ్జరీ వాహనాల్లో కూడా డీజిల్ వినియోగం అధికంగా ఉంటుండటంతో ఆయిల్ కంపెనీలకు నష్టాలు పెరుగుతున్నాయి. అందుకే, డీజిల్ వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది.