స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 148 పాయింట్లు పుంజుకుని 14,642 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 45 పాయింట్లు బలపడి 4,336 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.02 శాతం, నిఫ్టీ 1.04 శాతం మేరకు వృద్ధి చెందాయి. మౌలికరంగ పరిశ్రమలు వృద్ధిని నమోదు చేయడంతో భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడినట్లేనని ఆర్థిక నిపుణుల అంచనాలతో నష్టాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్ తిరగి లాభాల్లో ప్రవేశించింది. దీనికి తోడు మార్చి-జూన్ త్రైమాసికంలో అమెరికా స్టాకులు దశాబ్ద కాలంలో అత్యుత్తమ వృద్ధిని నమోదు చేశాయి.
దీని ప్రభావంతో ఆసియాని ప్రధాన మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. కాగా, బీఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇప్పటి వరకు మొత్తం 2,441 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,012 కంపెనీల వటాలు లాభపడ్డాయి. అలాగే 1,327 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి. డీఎల్ఎఫ్ 4 శాతం మేరకు లాభపడింది. |