బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల్లో నడిచింది. ఆసియా, అమెరికా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో 105 పాయింట్ల పతనమై 14,553 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కాసేపటికే 14,500 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. అనంతరం బీఎస్ఈ సూచి క్రమక్రమంగా పుంజుకుంది.కేంద్ర బడ్జెట్ నుంచి ఆశాజనక సంకేతాలు రావడంతో ఒకానొక దశలో కనిష్ట స్థాయి నుంచి 446 పాయింట్లు వృద్ధి చెంది 14,946 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆర్థిక సర్వే, రైల్వే బడ్జెట్ ఆశాజనక వాతావరణం సృష్టించడంతో మార్కెట్ ముగింపు వరకు లాభాల్లోనే కొనసాగింది. ముగింపు సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు వృద్ధి చెంది 14,913 వద్ద స్థిరపడింది.ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు లాభాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 75 పాయింట్లు పుంజుకొని 4424 వద్ద నిలిచింది. మార్కెట్ లావాదేవీల్లో హెచ్డీఎఫ్సీ వాటాలు 8 శాతం, టాటా స్టీల్ వాటాలు 4.5 శాతం పుంజుకున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా వాటాలు 3.5 శాతం లాభపడ్డాయి. |