అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీచిన బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 268 పాయింట్లు కోల్పోయి 16,866 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 5,003 వద్ద ముగిసింది.
ఈ రోజు ఉదయం 73 పాయింట్ల నష్టంతో 17,062 వద్ద స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. రోజంతా స్టాక్ మార్కెట్ ఏ మాత్రం కోలుకోలేదు. అన్ని సెక్టోరల్ ఇండెక్స్లు దాదాపు నష్టాలతోటే ముగిశాయి. గ్లోబల్ ట్రెండ్తో గత వారంలో 17 నెలల గరిష్ఠ స్థాయిని చేరుకున్న స్టాక్ మార్కెట్ ఈ రోజు మాత్రం.. లాభార్జన కోసం ఇన్వెస్టర్లు తెగబడటంతో ఒకానొక దశలో 268 పాయింట్లు నష్టపోయింది.
ముగిసిన గత మూడు సెషన్లలో 441.5 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఈ రోజు మాత్రం 268.14 పాయింట్లు కోల్పోయి 16,866.41 పాయింట్లు నష్టపోయింది. అమెరికా ఉద్యోగ నివేదిక సెంటిమెంట్ ఆసియా మార్కెట్లన్నింటిపై ప్రభావం చూపింది. ఎఫ్సీఎంజీ రెడ్ మార్కులో ముగిసింది. బడ్జెట్ రోజు తర్వాత ఎఫ్సీఎంజీ ఇంత స్థాయిలో క్షిణించడం ఇదే ప్రథమం.
మరోవైపు.. రియాల్టీ, టెక్, మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగాల ఇండెక్స్లు కూడా 2 నుంచి 4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. కాగా, సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,833 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,991 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే 779 కంపెనీల వాటాలు లాభాల్లో ఉన్నాయి.
నష్టాలను చవిచూసిన కంపెనీలు
భారతీ ఎయిర్టెల్, గ్రాసిం, హిండాల్కో, ఆర్కామ్, డీఎల్ఎఫ్, స్టెరిలైట్, ఎస్బీఐ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, జేపీ అసోసియేట్స్, టీసీఎస్, టాటా స్టీల్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏసీసీ తదితర సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి.
లాభపడ్డ కంపెనీలు
ఐటీసీ, సన్ ఫార్మా, రిలయన్స్ ఇన్ఫ్రా తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.