స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 394 పాయింట్లు పుంజుకుని 15,799 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 112 పాయింట్లు లాభపడి 4,675 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.62 శాతం, నిఫ్టీ 2.45 శాతం మేరకు వృద్ధి చెందాయి.
రియాల్టీ, ఐటీ, చమురు స్టాకుల కొనుగోళ్లు స్టాక్ మార్కెట్ను మరింత బలోపేతం చేశాయి. గత రెండు వారాల్లో నష్టాల్లో పయనించిన ఒక్క రియాల్టీ రంగమే 6 శాతం మేరకు బలపడింది. అలాగే ఐటీ, చమురు రంగాలు 2 నుంచి 3 శాతం లాభపడ్డాయి. జేపీ అసోసియేట్స్, హిండాల్కో, డీఎల్ఎఫ్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, స్టెరిలైట్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉన్నాయి.
టాటా పవర్, గ్రాసిం, సన్ ఫార్మా తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 2,428 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,398 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 975 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి.