స్టాక్ మార్కెట్ ఇటీవలి నష్టాలను తిరిగి రికవరీ చేసుకుంటోంది. ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తరహాలోనే ఇప్పుడు కూడా పెద్ద కరెక్షన్ ఏదైనా వచ్చిందేమో అన్న భయాందోళనలకు గురయ్యే తరుణంలో.. ఉద్దీపనలను యథావిధిగా కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ హామీ ఇచ్చారు.
ఈ హామీ స్టాక్ మార్కెట్లకు కొండంత అండనిచ్చింది. దీనికి తోడు అంతర్జాతీయ సానుకూలతలు సైతం మార్కెట్ ర్యాలీకి అండగా నిలిచాయి. ప్రతి ట్రేడింగ్లో దాదాపు స్టాక్ మార్కెట్ ఇంచుమించు లాభాలను నమోదు చేస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 511 పాయింట్లు లాభపడి 16వేల మార్కుకు చేరువలో.. 15,916 వద్దకు చేరుకుంది.
అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 144 పాయింట్లు పుంజుకుని 5వేల మార్కు దిశగా.. 4,708 వద్ద పరుగులు తీస్తోంది. సెన్సెక్స్ 3.32 శాతం, నిఫ్టీ 3.16 శాతం మేరకు లాభపడ్డాయి. జేపీ అసోసియేట్స్, హిండాల్కో, డీఎల్ఎఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, రిలయన్స్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉండగా.. టాటా పవర్, సన్ ఫార్మా తదితర సంస్థల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి.