ఈ వారంలో మొదట నష్టాలు.. ఆ తర్వాత లాభాల పంట పండింది. నిన్న వారాంతంలో స్టాక్ మార్కెట్ 1.65 శాతంతో 262 పాయింట్లు లాభపడి 16,158 వద్ద నిలిచింది. నిఫ్టీ కూడా 1.79 శాతంతో 84.45 పాయింట్లు పుంజుకుని 4,796.15 వద్ద ముగిసింది. గత వారం నష్టాలను కొనసాగిస్తూ.. ఈ వారం అత్యంత బలహీనంగా స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.
సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఆ తర్వాత మంగళవారం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సుమారు 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. అయితే ఆ మరుసటి రోజే.. భారీ షేర్లతో ఇండెక్స్ నిదానంగా రికవరీ కాగలిగింది. అప్పటికే కొనుగోళ్లు, విక్రయాలతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయింది.
దీంతో గురువారం ఉదయం స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. ఈ సమయంలో.. వచ్చే ఏడాదిలో అమలు చేయనున్న కొత్త పన్ను నియమావళిని క్రమబద్ధీకరిస్తామని మరింత సులువుగా ఉండేందుకు సమీక్షిస్తామంటూ కేంద్రం ప్రకటించింది. అలాగే మరో ప్రత్యేకమైన విషయం.. పెట్టుడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని కూడా కేంద్రం ప్రకటించింది.
ఇది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచింది. దీంతో స్టాక్ మార్కెట్ గురువారం మధ్యాహ్నపు ట్రేడ్ల సమయానికి పుంజుకుంది. ఇక అప్పటి నుంచి స్టాక్ మార్కెట్ దాదాపు లాభాల్లోనే పయనించింది. అక్టోబర్ 24న ముగిసిన వారానికి.. ఆహార ద్రవ్యోల్బణం 13.3 శాతానికి పెరిగింది. గతంలో ఇది 12.85 శాతం వద్ద ఉండేది.
గతంలో వారానికి ఒకసారి వెల్లడించే ద్రవ్యోల్బణం సమాచారం.. ఇక నుంచి నెలవారి సమాచారన్ని అందించేందుకు రంగం సిద్ధం చేశారు. అదలా ఉంచితే. ప్రత్యక్ష పన్ను సేకరణలు కూడా పెరిగాయి. గత నెలలో ఇది రూ. 19,708 కోట్లు ఉండగా.. అక్టోబర్లో రూ. 20,822 కోట్లు వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బీఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ వారం అత్యధిక లాభాలను గడించిన సంస్థ భారతీ ఎయిర్టెల్, ఆ తర్వాత స్థానాల్లో జేపీ అసోసియేట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకీలు ఉన్నాయి. అలాగే అత్యధిక నష్టాల్లో టాటా పవర్, ఏసీసీ, హిందుస్థాన్ యునిలివర్ తదితర కంపెనీల ఉన్నాయి.