దేశీయ, విదేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభ, నష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, నిఫ్టీలు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో లాభదాయకంగా కొనసాగాయి. సెన్సెక్స్ 16వేల మార్కును, నిఫ్టీ 4800 పాయింట్ల మార్కును తాకాయి.
రియాల్టీ, మెటల్, ఆయిల్, గ్యాస్, పీఎస్యూ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడం, అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ స్వల్పంగా క్షీణించింది. కానీ టెక్, ఆటో, హెల్త్కేర్ వాటాల ట్రేడింగ్ ఆశాజనకంగా కొనసాగడం సెన్సెక్స్ వృద్ధికి ప్రధాన కారణమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.