బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఏడు పాయింట్లు స్వల్ప వృద్ధితో 18,409 పాయింట్ల మార్కు వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 12 పాయింట్ల లాభంతో 5,543 పాయింట్ల మార్కును తాకింది.
అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోవడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలను ఆర్జించింది. అలాగే యూరప్ మార్కెట్ పురోగమనం వైపు ర్యాలీని పయనింపజేయడంతో స్టాక్ మార్కెట్ లాభదాయకంగా ముగిసింది. ఇంకా కన్జూమర్ డూరబుల్స్, పీఎస్యూ, ఎఫ్ఎమ్సీజీ, టెక్నాలజీ వాటాల ట్రేడింగ్ ఆశాజనకంగా కొనసాగడం ద్వారా సెన్సెక్స్, నిఫ్టీలు లాభాలను ఆర్జించాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇకపోతే.. జిందాల్ స్టీల్, సిప్లా, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ వంటి సంస్థలు లాభపడగా, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీసీ, జైప్రకాష్ అసోసియేట్స్ వంటి కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి.