వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 247 పాయింట్ల భారీ నష్టంతో 18వేల (17,979) మార్కు దిగువ స్థాయికి పడిపోయింది. గతవారం 30నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న సెన్సెక్స్, ఈ వారాంతం 18వేల పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో 18,248 పాయింట్ల మార్కును తాకినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో అదే మార్కువద్ద కొనసాగలేకపోయింది. ఇదేవిధంగా నిఫ్టీ కూడా 80 పాయింట్లు కోల్పోయి, 5,397 పాయింట్ల వద్ద స్థిరపడింది.
మెటల్, పీఎస్యూ, రియాల్టీ, బ్యాంకింగ్, ఐటీ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అలాగే అమెరికా, యూరప్ స్టాక్ మార్కెట్లు తిరోగమనం వైపు పయనించడం ద్వారా సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి. ఇంకా మదుపుదారులు సైతం లాభాల స్వీకరణను వెనక్కి తీసుకోవడం స్టాక్ మార్కెట్కు కలిసిరాలేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇకపోతే.. ఏసీసీ, హీరో హోండా మోటార్, ఓఎన్జీసీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు లాభపడగా, భెల్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, డీఎల్ఎఫ్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్థాన్ యునిలివర్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ టెక్, ఐటీసీ, జిందాల్ స్టీల్, జేపీ అసోసియేట్స్, లార్సెన్ అండ్ టర్బో, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ వంటి కంపెనీలు నష్టపోయాయి.