భారతదేశం హోటల్ పరిశ్రమకు అనువైన స్థానంగా మారిందని, అందువల్ల వచ్చే నాలుగైదు ఏళ్లలో రూ.ఐదు వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు హ్యాంప్షైర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సంస్థ ప్రకటించింది. దీనిపై ఆ సంస్థ ఛైర్మన్, ఎన్నారై పారిశ్రామికవేత్త సంత్సింగ్ ఛత్వాల్ మాట్లాడుతూ.. ఇప్పటికే హైదరాబాద్లో తొలి హోటల్ను ప్రారంభించినట్టు చెప్పారు. అలాగే.. కొచ్చిన్లో సూపర్ లగ్జరీ హోటల్ను త్వరలో నిర్మించనున్నట్టు వివరించారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో 5000 కోట్ల రూపాయల వ్యయంతో 27 నక్షత్ర హోటల్స్ను నిర్మించనున్నట్టుగా ఆయన చెప్పారు. అలాగే హైదరాబాద్లో కూడా మరో రెండు హోటల్స్ను నిర్మించే ప్రతిపాదన వున్నట్టు ఛత్వాల్ వివరించారు. భాగ్యనగరిలో నిర్మించిన తొలి హోటల్పై వంద కోట్ల రూపాయలు వెచ్చించినట్టుగా ఆయన తెలిపారు.
హైదరాబాద్ హోటల్ ప్రాజెక్టుల కోసం భవిష్యత్లో మరో 500 కోట్ల రూపాయలను వెచ్చించాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. హైదరాబాద్లో నిర్మించిన హోటల్ను ముఖ్యమంత్రి వైఎస్సార్ లాంఛనంగా ప్రారంభించారని వివరించారు.
|