తమ కంపెనీ, జపాన్కు చెందిన దైయిచీ సాంక్యోల మధ్య కుదురుతున్న ఒప్పందాన్ని భగ్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని రాన్బాక్సీ లేబొరేటరీస్ ఆరోపిస్తోంది. ఇందుకు ఒక ప్రధాన కంపెనీ కారణమని రాన్బాక్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మల్వీందర్ సింగ్ విమర్శించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బాగా వృద్ధి చెందుతున్న జెనరిక్ ఔషధాల ఉత్పత్తులను అడ్డుకోవడానికి పన్నాగం పన్నారని చెప్పారు.
అమెరికాకు సరఫరా అయ్యే రాన్బాక్సీ ఔషధాల నాణ్యతపై మేరీ ల్యాండ్లోని ఒక జిల్లా కోర్టు విచారణ జరుపుతోంది. రాన్బాక్సీలో మెజార్టీ వాటాలను కొనుగోలు చేసేందుకు దైయిచీ ఒప్పదం కుదుర్చుకుంది. సరిగ్గా నెల రోజుల తరువాత ఈ కేసు దాఖలయ్యింది.
పని కట్టుకుని తప్పుడు అందిస్తున్నారని ఆరోపించారు. దైయిచీ కంపెనీతో కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పందానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. రాన్బాక్సీపై ఆరోపణలు గనుక రుజువయితే ఆ కంపెనీ అమెరికా అమ్మకాలకు తీవ్ర విఘాతం ఏర్పడే అవకాశం ఉంది.
అమెరికాలో తక్కువ నాణ్యత కలిగిన ఔషధాలను విక్రయిస్తోందనే ఆరోపణలతో కూడిన పత్రాలను రాన్ బాక్సీ నాశనం చేసిందన్న ఆరోపణలను మల్వీందర్ ఖండించారు. డాక్యుమెంట్లను ఆపి పెట్టుకునే అధికారాన్ని తాము కలిగి ఉన్నామని ఆయన అన్నారు. రాన్బాక్సీ ఔషధాల విషయంలో ఈ వివాదం తెరపైకి రావటంతో ఆ కంపెనీ షేరు విలువపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపించింది.
|