రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులు సామానులు భద్రపరుచుకునే క్లోక్ రూం ఛార్జీలను పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. పెరగనున్న ఛార్జీలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని భారతీయ రైల్వే (ఐఆర్) వర్గాలు అన్నాయి. క్లోక్ రూంలలో 24 గంటల పాటు భద్రపరుచుకునే ప్రతి సామానుకు ప్రస్తుతం రూ.10లు చెల్లిస్తుండగా, ఇకపై ఇది రూ.15లు అవుతుంది. అలాగే లాకర్ ఛార్జీలు రూ. 15 నుంచి రూ. 20లకు పెంచుతున్నారు.
ప్రయాణీకులు తమ సామానును అదనంగా మరో రోజు భద్రపరుచుకోదలిస్తే రూ. 25లు చెల్లించాలి. అలాగే లాకర్కు రూ.40లు వంతున చెల్లించాలి. క్లోక్ రూం ఛార్జీలను ఏడేళ్ల తర్వాత సవరిస్తున్నామని రైల్వే వర్గాలు తెలిపారు. ఆపై రోజుకు ఇదే వంతున చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు 2001 అక్టోబరులో ఈ ఛార్జీలను పెంచటం జరిగిందని వివరించారు.
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో క్లోక్ రూంలు, లాకర్ల సదుపాయాన్ని ప్రయాణీకులకు భారతీయ రైల్వే కల్పిస్తుంది. ఈ సదుపాయాలను ప్రయాణీకులు విరివిగా వినియోగించుకుంటున్నారు. భారతీయ రైల్వేకు దేశవ్యాప్తంగా దాదాపు 7వేల స్టేషన్లు ఉండగా అందులో 2వేల స్టేషన్ల నుంచి ప్రయాణీకుల రాకపోకలు అధికంగా ఉంటాయి.
|