బుల్లితెర వీక్షకులకు మరో అరుదైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. తమ పిల్లలకు అనువైన వివాహ సంబంధాలను మన గృహాల్లో ఉండే టీవీల ద్వారానే ఎంచుకోవచ్చు. ఈ సౌకర్యం పొందాలంటే మాత్రం టాటా స్కై కనెక్షన్ను విధిగా కలిగి ఉండాలి. వివాహ సంబంధాల సమచార సేకరణలో అగ్రగామి సంస్థగా ఉన్న భారత్ మేట్రిమోని, కేబుల్ టీవీ ప్రసారాల్లో మెరుగైన సేవలు అందిస్తున్న టాటా స్కై సంస్థలు బుధవారం ఒక అహగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందంపై భారత్ మేట్రిమోని పోర్టల్లో నిక్షిప్తమై ఉన్న యువతీ యువకుల సమాచారం క్షణాల్లో తెలుసుకోవచ్చు. టాటా స్కై కనెక్షన్ కలిగిన ప్రతి టీవీలో వీరి సమాచారం అందుబాటులో ఉంటుంది. వరుడు లేదా వధువు ప్రాథమిక సమాచారం మీకు నచ్చిన పక్షంలో మరిన్ని వివరాల కోసం ఒకే ఒక ఎస్ఎంఎస్ను పంపితే చాలు. అన్ని వివరాలు మీకు అందుబాటులో ఉండేలా భారత్ మేట్రిమోని నిర్వాహకులు చర్యలు తీసుకుంటారు.
ఈ అవగాహనా ఒప్పందంపై టాటాస్కై మార్కెటింగ్ ముఖ్యాధికారి విక్రమ్ మెహ్రా, భారత్ మేట్రిమోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురుగవేల్ జానకిరామన్ బుధవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం పెద్దల కుదిర్చిన పెళ్లిళ్ళకే అధిక ప్రధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారికి యువతీ యువకుల సమాచారాన్ని చేరవేసేందుకు గాను ఇరు సంస్థలు ఒక అవగాహనా ఒప్పందానికి వచ్చినట్టు చెప్పారు.
ఈ ఒప్పందం మేరకు భారత మేట్రిమోనిలో అందుబాటులో ఉన్న యువతీయువకుల సమాచారాన్ని టీవీల్లోనే తెలుసుకోవచ్చని తెలిపారు. టాటా స్కైకు 2.3 మిలియన్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. వీరకందరికీ ఉచితంగా ఈ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. ఈ వివరాలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సేవల కోసం 'యాక్టివ్ మేట్రిమోని' అనే విభాగంలోకి వెళితే చాలని వారు చెప్పారు.
|