సింగూర్ ప్రాజెక్టుపై కమ్ముకున్న నీలిమేఘాలు మెల్లగా కరిగి పోతున్నాయి. ముందుగా ప్రకటించినట్టుగా, నిర్ణీత గడువులోగా తమ మానసపుత్రిక నానో కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అన్నీ అనుకూలంగానే జరుగుతాయని టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తాజా వ్యాఖ్యలు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి కాస్త ఊరట కలిగించాయి.
సింగూర్ నుంచి నానో కార్ల ఫ్యాక్టరీ తరలించేది లేదని రతన్ టాటా చేసిన వ్యాఖ్యల్లో పరోక్షంగా స్పష్టమైంది. అయితే దీనికి అన్నీ సక్రమంగా అనుకూలించాల్సి వుంది. ఎస్ఐఏఎమ్ ప్రతినిధి బృందంతో కలిసి రతన్ టాటా గురువారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన కీలక చర్చల్లో సింగూర్ సమస్యకు పరిష్కార మార్గం లభించినట్టు వినికిడి.
సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ.. నానో కారును నిర్ణీత గడువులోగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అన్నీ అనుకూలంగా జరుగుతాయన్నారు. ఇదిలావుండగా బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ కూడా సింగూర్ సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. ఇప్పటికే ప్రాథమిక చర్చలను ప్రారంభించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో శుక్రవారం సమావేశమై చర్చలు జరుపనున్నారు.
|