భారత కార్ల మార్కెట్లో పదిశాతం వాటాను సాధించడమే లక్ష్యంగా ఎంచుకున్న ప్రముఖ జపాన్ కార్ల ఉత్పత్తి దిగ్గజం టయోటా కంపెనీ శుక్రవారం సరికొత్త... అధునాతన వెర్షన్ కారును ఆవిష్కరించింది. 'సిడాన్, కొరోలా ఆల్టిస్' పేరుతో విడుదలైన ఈ ఆధునిక వాహనం ధర రూ 10.83 మరియు రూ. 12.86 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర).
మూడు విభిన్నరకాల గ్రేడ్లలో విడుదలైన ఈ కొత్త కారు 1.8 పెట్రోల్ లీటర్ ఇంజిన్ను కలిగి ఉంది. ఈ సంవత్సరంలో 63వేల వాహనాలను విక్రయించాలన్నది తమ ప్రస్తుత లక్ష్యమని... అలాగే 2015 ఆర్ధిక సంవత్సరం కల్లా 10 శాతం వాటాను కైవసం చేసుకోవాలన్నది భవిష్య లక్ష్యంగా టయోటా కంపెనీ వెల్లడించింది.
ఈ లక్ష్యాలను సాధించడంలో భాగంగా కొత్త కారు 'ఆల్టిస్' ప్రారంభించి ఓ పెద్ద అడుగు ముందుకేసినట్లుగా టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎమ్) వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. గత ఏడాదిలో తమ సంస్థ 50వేల యూనిట్లను విక్రయించిందని... ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో తాము 3 శాతం వాటాను కలిగి ఉన్నట్లు విక్రమ్ అన్నారు.
తమ లక్ష్యాన్ని ప్రణాళిక ప్రకారం చేదించేకు విభిన్న రకాలైన మోడళ్లను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అలాగే ఈ నెలాఖరు లోగా కొరోలా ఆల్టిస్ కార్లు సగటున 2వేల యూనిట్ల మేర విక్రయించేలా ప్రణాళిక చేశామని విక్రమ్ వ్యాఖ్యానించారు. కాగా, బెంగుళూరులో చిన్న తరహా కార్ల ఉత్పత్తి చేపట్టేందు కోసం సుమారు రూ. 1,400 కోట్ల పెట్టుబడితో రెండో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు గతంలో టయోటా ప్రకటించింది. అలాగే చిన్న తరహా కార్లను మరో రెండేళ్లలోపు భారత మార్కెట్లోకి ప్రవేశపెడతామని తెలిపింది.
|