ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7 శాతం వృద్ధిరేటు సాధించేందుకు సిద్ధమవుతోందని ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా చెప్పారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న కారణంగా ద్రవ్య విధానంలో భారతీయ రిజర్వ్ బ్యాంకుకు మరింత సౌలభ్యత ఏర్పడనుందని తెలిపారు. రిజర్వ్ బ్యాంకు సైతం దేశ ఆర్థిక వృద్ధి రేటు 7.5 నుంచి 8.0 శాతం వరకు ఉండగలదని అంచనా వేసిన విషయం మాంటెక్ గుర్తు చేశారు. ప్రస్తుత సంక్షోభంలో ఆర్బీఐ అంచనా కొంచెం వెనకపట్టు పడుతుందని భావిస్తున్నామని, ప్రణాళికా సంఘం 7 శాతం వృద్ధి రేటును ఊహిస్తున్నదని చెప్పారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే కొద్దీ దేశీయ ద్రవ్యవిధానం మరింత సరళతరమవుతుందని తాను దృఢంగా భావిస్తున్నట్లుగా మాంటెక్ చెప్పారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు గతంలో తాను అంచనా వేసిన దానికి భిన్నంగా జీడీపీ వృద్ధి రేటును 8 శాతానికి బదులుగా 7.5 నుంచి 8 శాతానికి కుదించడంతో ప్రణాళికా సంఘం కూడా తన అంచనాలను సవరించుకోవలసి వచ్చింది. |